దక్షిణ కొరియా పర్యటనలో నారా లోకేష్
Minister Nara Lokesh in South Korea
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ పలు దేశాలు తిరుగుతున్నారు. ఏ దేశంలో పర్యటించినా ఆంధ్రప్రదేశ్ కి ఏదో ఒక కంపెనీ తీసుకువచ్చేలా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో అక్కడి కంపెనీల సీఈవో కలుస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాదరక్షలు, వాటి అనుబంధ పరికరాల తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్ యాజమాన్యంతో ఆయన జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
ఆంధ్రలో పాదరక్షలు తయారీ యూనిట్ ఏర్పాటుకు బూ యంగ్ గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ పలువురు కంపెనీ అధిపతులను మీటయిన తర్వాత.. పెట్టుబడులు, నిధుల నిర్వహణ, కన్సల్టింగ్ సేవల ద్వారా సార్టప్ లు, ఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చేందుకు BNK వెంచర్ క్యాపిటల్ సంస్థ.. ఏపీలోని ఆర్ టీఐహెచ్ లో మెంబర్/మెంటర్ గా చేరాల్సిందిగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టులైన అమరావతి, పారిశ్రామిక పార్కులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఇంధన పరిశ్రమలకు చెందిన క్లయింట్లను వారి పెట్టుబడి/ఉత్పత్తి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో BNK ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని BNK గ్రూప్ ఎండీ లీ క్వాంగ్ జున్, బిఎన్ కె క్యాపిటల్ సీఈవో సన్ డే జిన్ హామీ ఇచ్చారు.







































