మావయ్య అండతో దండయాత్రకు సిద్దం!

యువహీరో సందీప్‌కిషన్‌ ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన వన్‌ మూవీ వండర్‌గానే మిగిలిపోయాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఈయనకు హిట్లు కాదు కదా..! కనీసం యావరేజ్‌ చిత్రం కూడా లేదు. కానీ ఇండస్ట్రీలో తనకున్న మావయ్య అండదండలతో ఆయన ఎదగాలని చూస్తున్నాడు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చిన నాని, శర్వానంద్‌, రాజ్‌తరుణ్‌లు దూసుకుపోతుంటే ఈ యంగ్‌హీరో మాత్రం కుదేలైపోయాడు. దాంతో ఆయన ఈ ఏడాదిని దత్తత తీసుకొని వరుస చిత్రాలతో ప్రేక్షకులపై దండయాత్రకు దిగుతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించిన 'నక్షత్రం' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని సరైన విడుదల తేదీకోసం ఎదురుచూస్తోంది. ఇక మహేష్‌ సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్‌ హీరోగా నటిస్తున్న చిత్రం తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. కేవలం తెలుగునే నమ్ముకుంటే లాభం లేదని భావించిన ఆయన విశాల్‌, జయం రవి, ఆది పినిశెట్టి వారి స్ఫూర్తితో తమిళంలో కూడా చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన తమిళ చిత్రాలైన 'మాయావన్‌, మానగరం' చిత్రాలు పూర్తయ్యాయి. వీటిని తెలుగులో డబ్‌ చేసి విడుదల చేయనున్నారు. ఇక ఆయన తమిళ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ సుశీంద్రన్‌ దర్శకత్వంలో తమిళ, తెలుగుభాషల్లో ఓ భారీ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా మెహ్రీన్‌ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది.మరి ఈ ఐదు చిత్రాలను ఆయన ఇదే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ ఘజనీమొహ్మద్‌ దండయాత్రలో ఆయన తనకు కనీసం ఒక్క హిట్టయినా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ వరుస చిత్రాలు సందీప్‌కిషన్‌ కు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాల్సివుంది...!

sundeep kishan
venkatadri express
sundeep kishan 2017 movies