ప్రమాణ స్వీకారం వేళ ఉద్వేగానికి లోనైన తల్లిదండ్రులు

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అపురూప ఘట్టం మదర్స్ డే రోజే రావడం విశేషం. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుమారుడు వెండితెరపై దళపతిగా మెప్పించి ఇప్పుడు ప్రజా సేవలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం తల్లిదండ్రులుగా తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ వేడుక మదర్స్ డే నాడు జరగడంపై విజయ్ తల్లి శోభ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తల్లిగా ఇంతకంటే పెద్ద కానుక మరేముంటుంది? అని వ్యాఖ్యానించారు. తన కుమారుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరి సంక్షేమం కోసం పని చేస్తాడనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి ఈ విజయ కేతనం వేళ కుటుంబమంతా ఒక్కటిగా కనిపించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
తమిళనాడు అంతటా విజయ్ ముఖ్యమంత్రి అనే నినాదాలతో హోరెత్తుతోంది. వెండితెరపై అశేష ప్రేక్షకాదరణ పొందిన విజయ్ ఇప్పుడు వాస్తవ రాజకీయ మైదానంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో ?చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో మదర్స్ డే వంటి ప్రత్యేక రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విజయ్ రాజకీయ ప్రయాణంలో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోనుంది.








































