గ్రేట్ న్యూస్: ‘మహానటి’కి అరుదైన గౌరవం

‘మహానటి’కి అరుదైన గౌరవం.. ఇండియన్ పనోరమాకి ఎంపిక
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత కథ ‘మహానటి’గా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వసూళ్లతో నీరాజనాలు అందించారు. విమర్శకుల ప్రశంసలూ లభించాయి. ఇప్పుడు మహానటికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమాలో తెలుగు చిత్రసీమ నుంచి ప్రదర్శన కోసం ‘మహానటి’ ఎంపికైంది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు త్వరలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా ‘మహానటి’ని ప్రదర్శిస్తారు. హిందీ, తమిళ, మలయాళం, తుళు... ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్లో మాత్రం భారతదేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. అందులో దక్షిణాది నుంచి ఒక్క ‘మహానటి’కే స్థానం దక్కింది.
The film ‘Mahanati’ has been selected in Indian Panorama films for the 49th edition of the International Film Festival of India (IFFI) 2018
Mahanati goes International Film Festival of India







































