ఆహా... మాస్‌రాజాకు అంత 'బలుపా'..?

ఎవ్వరి అండదండలు లేకుండా ఓ వైపు కృష్ణవంశీ, మరోవైపు పూరీజగన్నాథ్‌లను మేనేజ్‌ చేసి తన స్వంత ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో మాస్‌రాజా దాకా ఎదిగి తన మార్కెట్‌ను సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'కిక్‌'తో రూ.40కోట్ల మార్కెట్‌ను తాకాడు రవితేజ. వాస్తవానికి తన కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లున్నప్పటికీ కేవలం తనకున్న మినిమం గ్యారంటీ హీరో అనే మంచి పేరుతో ఏడాదికి మూడునాలుగు చిత్రాలు కూడా చేసిన రవితేజ 'బెంగాల్‌టైగర్‌' తర్వాత మరలా ముఖానికి మేకప్‌ వేయలేదు. ఈ గ్యాప్‌లో ఆయన వేణుశ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా 'ఎవడో ఒకడు' ఒప్పుకొని ఆ తర్వాత ఆ చిత్రాన్ని తన చేతులారా  తానే నాశనం చేసుకున్నాడు. ఆ తర్వాత చక్రి అనే నూతన దర్శకునితో 'రాబిన్‌హుడ్‌' చేస్తానని క్యాన్సిల్‌ చేశాడు. విక్రమ్‌ సిరి అనే నూతన దర్శకునికి కూడా ఓకే చెప్పి ఆ తర్వాత నో చెప్పాడు. మరలా సంపత్‌నంది, బాబి దర్శకత్వాల్లో చిత్రాలు చేస్తాడని వార్తలు వచ్చాయి. చివరకు ఆ చిత్రాలు కూడా మూలనపడ్డాయి. ఈలోపు ఆయన ప్రపంచ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లు పూరీ జగన్నాథ్ చెబితేనే తెలిసింది. కానీ ఇంతకాలం తన కెరీర్‌ను పూర్తిగా అవపోసన పట్టి, తనకు ఎలాంటి చిత్రాలు, ఎలాంటి దర్శకులు,నిర్మాతలు సూట్‌ అవుతారు? అనే కిటుకులన్నీ ఒడిసి పట్టిన తన కుడి భుజంలాంటి పర్సనల్‌ మేనేజర్‌ను పక్కనపెట్టాడు. ఈ మేనేజర్‌ డిస్ట్రిబ్యూటర్లలో, నిర్మాతల్లో, రవితేజకు అవసరమైన ప్యాడింగ్ ఆర్టిస్టులతో సత్సంబంధాలు కలిగిన వాడు. కానీ ఆయన తన కెరీర్‌ను ఎదగనివ్వడం లేదని, తనను మీడియం బడ్జెట్‌ చిత్రాలకు, నిర్మాత, దర్శకులకే పరిమితం చేస్తున్నాడన్న బాధతో తనను నమ్మిన ఆ మేనేజర్ ని తప్పించి అన్ని విషయాల్లో అరకొర జ్ఞానం ఉన్న మేనేజర్‌ను పెట్టుకున్నాడు. ఇక ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ తన బడ్జెట్‌ను పెంచి తన మార్కెట్‌ను పెంచి, తనను రూ.50కోట్ల క్లబ్‌లో చేర్చాలని తొందరపెట్టాడు. కానీ రవితేజ తన మార్కెట్‌ను కేవలం 'కిక్‌'తోనే పోల్చుకొని బడ్జెట్‌ కనీసం రూ.40కోట్లు పెంచే నిర్మాత, దర్శకులయితేనే తన నిర్మాతలు లాభం పొందేలా తాను రూ.50కోట్ల క్లబ్‌లో చేరుతానని రవితేజ తాను ఎదిగిన ఆత్మవిశ్వాసాన్ని 'అతి విశ్వాసం'గా మార్చుకున్నాడు. కానీ తన వయసు మీద పడిపోయిందని చెప్పిన వారిని ధూషించి నిర్మాతలను, దర్శకులను పోగొట్టుకున్నాడు. అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో పెనుమార్పులు జరిగాయి. సాయిధరమ్‌తేజ్‌, నానిలు కేవలం 10, 20కోట్ల బడ్జెట్‌తో తీసే దర్శకనిర్మాతలను చూసుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద మినిమం గ్యారంటీ హీరోలుగా పేరు కొట్టేశారు. ఒక్క సూపర్‌హిట్‌ లేకుండానే తన మార్కెట్‌ను రూ.25కోట్లకు పెంచుకున్న సాయిధరమ్‌తేజ్‌, 'భలే భలే మగాడివోయ్‌'తో రూ.30కోట్లు కొల్లగొట్టిన నానిలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు రవితేజ పోకడల్లోనే పోయిన రాజ్‌తరుణ్‌ వంటి హీరోలు కూడా త్వరగానే బుద్ది తెచ్చుకుంటున్న నేపథ్యంలో.... తనతో సినిమా అంటే ఖచ్చితంగా రూ.40కోట్ల పెట్టుబడి పెట్టే దర్శకనిర్మాతలతో అయితే చేస్తానని, అంతేగాక ఇప్పటికే తాను చేసే తరహా చిత్రాలపై అవగాహన ఉండి, తాను చేయలేకపోయిన దర్శకులు ఉన్నారని, వారికి ఎంత రెమ్యూనరేషన్‌ ఇచ్చి అయినా ఒప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొత్తానికి ఆయన ప్రస్తుత పరిస్దితి చూస్తుంటే ఉన్నది పాయె... ఉంచుకున్నది పాయే అనే మోటు సామెత గుర్తుకురాకమానదు. 

ravi teja
next movie
overconfidence
big movies
kick
robin hood movie
nani
raj tarun