సీట్ల పంపిణీలోనూ చంద్రబాబుకి చిక్కులే!

రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుండి రాజ్యసభకు టిడిపి నుంచి ఇద్దరు, బిజెపికి ఒక్క సీటును కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బిజెపితో ఎంత పడకపోయినా కూడా సంకీర్ణ ధర్మం ప్రకారం ఓ సీటును బిజెపికి ఇవ్వడానికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నాడు. బిజెపికి అవకాశం ఉన్న ఒక్క సీటును కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్‌కు కేటాయిస్తారా? లేక వెంకయ్యనాయుడుకు అవకాశం ఇస్తారా? లేక వీరిద్దరు కాకుండా వేరే వారిని రంగంలోకి దింపుతారా? అనేది బిజెపి అగ్రనాయకత్వం పరిధిలోని అంశం. అయితే టిడిపికి దక్కే రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు చెందిన టిడిపి నాయకులకు అవకాశం ఇవ్వాల్సిందిగా టిటిడిపి నాయకులు కోరుతున్నారు. కాగా అలా అవకాశం వస్తే ఆ సీటును మోత్కుపల్లికి కేటాయించే అవకాశం ఉంది. కానీ ఈ రెండు స్ధానాల కోసం ఏపీలోనే భారీ పోటీ ఉండటంతో ఒక సీటుకు తెలంగాణ వ్యక్తికి ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు. అందుకే మోత్కుపల్లికి గవర్నర్‌ గిరి ఎదురుచూస్తోందని అంటున్నారు. అయితే ఒక సీటును తెలంగాణ వ్యక్తులకు కేటాయిస్తే, తెలంగాణలో కనుమరుగు అవుతున్న టిడిపి నాయకులకు, కార్యకర్తలకు అది మనోబలంగా ఉంటుందని, చంద్రబాబు తెలంగాణను వదిలేయలేదని, ఇప్పటికీ చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉందని చాటి చెప్పినట్లు అవుతుందని టిటిడిపి నేతలు అంటున్నారు. కానీ ఏపీ టిడిపి నాయకులు మాత్రం రెండు సీట్లను తమకే కేటాయించాలని, సుజనాచౌదరికి ఒక సీటు ఇచ్చినా, రెండో స్దానాన్ని కాపు నేతలకు ఇవ్వడం ద్వారా పార్టీ ఏపీలో మరింతగా బలపడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఏపీ నేతలు మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి అందరినీ కాదని, తెలంగాణ నుంచి గుండు సుధారాణికి అవకాశం ఇస్తే ఆమె టిడిపి తరపున రాజ్యసభకు ఎంపికై ఆ తర్వాత కేసీఆర్‌ ప్రోద్బలంతో అధికార టిఆర్‌ఎస్‌లో చేరిందని, కాబట్టి తెలంగాణకు ఒకరికి అవకాశం ఇచ్చినా వారు టిడిపినే నమ్ముకొని ఉంటారని చెప్పలేమని, కేసీఆర్‌ వలలో చిక్కుకుంటే అసలుకే ఎసరు వస్తుందని వాదిస్తున్నారు. 

chandrababu naidu
rajya sabha seats
motkupalli
sujana
kaapu
t telangana
kcr