బాలీవుడ్ లో ఖాన్ల త్రయాన్ని కొట్టే వేరొక శక్తి లేదని భావించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాన్ ఇండియా ట్రెండ్ లో భాషా భేధం వెనకబడింది. ఏ భాష నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా పాన్ ఇండియాలో నిరూపించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అరడజను తెలుగు హీరోలు పాన్ ఇండియా రేసులో ఉన్నారు.
అయితే ఖాన్ల త్రయం 60లలో వయసు సంబంధ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు సమస్యల్లోకి వెళ్లే క్రమంలో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోలు 50లలో వారి వారసత్వాన్ని నడిపించడం కుదరదు. అందుకే రణబీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి వారిపై పెద్ద బాధ్యతలు ఉన్నాయి. కానీ రణ్ వీర్ స్థిరంగా రాణించడం లేదు. ఇటీవల మెరుగయ్యాడు. ఇప్పుడన్న హీరోల్లో బాలీవుడ్ లో రాజు కిరీటం దక్కించుకునే హీరో రణబీర్ కపూర్ మాత్రమే. అతడి తర్వాత కొందరు యువహీరోలు ఉన్నా కానీ ఎవరికీ సరైన బ్లాక్ బస్టర్లు లేవు. విక్కీ కౌశల్ చావాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి రేసులోకి వచ్చినా స్థిరంగా అతడు రాణించాల్సి ఉంది.
ప్రస్తుత లైనప్ చూస్తుంటే, రణబీర్ కపూర్- ధూమ్ 4, లవ్ అండ్ వార్, రామాయణం, యానిమల్ పార్క్ (యానిమల్ 2) లాంటి భారీ చిత్రాలతో టాప్ లీగ్ లో ఉన్నాడు. యానిమల్ చిత్రంతో అతడు 800 కోట్ల వసూళ్లను అందించాడు. అతడు వరుసగా 1000 కోట్ల క్లబ్ లు, అంతకుమించి అందుకోగలడని అంచనా వేస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగాన్ని రణబీర్ తో ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయడంతో భారతదేశపు అతిపెద్ద నిర్మాణ సంస్థలో అత్యంత భారీ ప్రాజెక్టులో అతడు భాగం కాబోతున్నాడని అర్థమవుతోంది. జాన్ అబ్రహాం, హృతిక్, అమీర్ ఖాన్ తర్వాత ధూమ్ ఫ్రాంఛైజీలో ప్రతినాయక పాత్రలో అవకాశం అందుకున్న రణబీర్ పెద్ద తెరపై చాలా మ్యాజిక్ చేయగలడన్న నమ్మకం ఉంది. ఇతర సినిమాలు భారీతనం నిండినవి. వెయ్యి కోట్లక్లబ్ అందుకోవడానికి ఆస్కారం ఉన్నవే.
మరోవైపు నార్త్ హీరోలను మించి, సౌత్ హీరోల డామినేషన్ కొనసాగుతోంది. రణబీర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలకు సౌత్ నుంచి భారీ పోటీ ఉంది. దేశంలో ఎవరూ టచ్ చేయలేని రేంజుకు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఎదిగేందుకు చాన్స్ లేకపోలేదు. చరణ్, ఎన్టీఆర్ లతో పాటు, మహేష్ కూడా జక్కన్న మూవీతో త్వరలో రేసులోకి రాబోతున్నాడు. మన స్టార్ల లైనప్ చూస్తే, ప్రభాస్ - సలార్ 2, కల్కి 2898 ఏడి, రాజా సాబ్ వంటి చిత్రాలతో టాప్ లీగ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ - అట్లీతో సైన్స్ ఫిక్షన్ సినిమా, పుష్ప 3 చిత్రాలతో తన స్టార్ డమ్ ని మరింత విస్తరించగలడు. త్రివిక్రమ్ సినిమా చేస్తాడు. తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ఛాన్సుంటుందని కథనాలొస్తున్నాయి. పుష్ప, పుష్ప 2 అసాధారణ విజయాల తర్వాత బన్ని కాన్ఫిడెన్స్ ఎవరిని అయినా కొట్టేస్తాను! అనేంతగా పెరిగింది. అతడి ప్రస్తుత లైనప్ చూస్తే షాకిస్తోంది.
1000 కోట్ల క్లబ్ తో రేసులోకి దూసుకొచ్చిన ఆర్.ఆర్.ఆర్ స్టార్లను తక్కువ చేయడానికేం లేదు. ఎన్టీఆర్ - వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ, దేవర 2 చిత్రాలతో రేసులో ఉన్నాడు. అతడు వార్ 2తో 1000 కోట్ల క్లబ్ అందుకుంటే, ఇక తిరుగుండదు. అతడు మరిన్ని బాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాల్లోకి ప్రవేశించే వీలుంటుంది. యష్ రాజ్ ఫిలింస్ అతడి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు స్పై యూనివర్శ్ లో అతడిని ఉపయోగించుకుంటోంది. అయితే ఇతరులతో పోలిస్తే శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కారణంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడుగు వెనక్కి వేసాడు. రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో పెద్ది, ఆయన గురువు సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ క్యూలో ఉన్నాయి గనుక కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు చరణ్ రేంజును మరింత పెంచాల్సి ఉంది.
ఇక దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడి స్థాయిని ఆకాశమే హద్దుగా ప్రభావితం చేయగలదని అంచనా వేస్తున్నారు. 1000 కోట్ల క్లబ్ రేసులో స్థిరంగా బ్లాక్ బస్టర్లు సాధించి రికార్డులు బ్రేక్ చేసే సత్తా వీళ్లలో ఏ హీరోకి ఉంది? అన్నది కాలం డిసైడ్ చేస్తుంది. వార్ లో రణబీర్, విక్కీ లాంటి బాలీవుడ్ ట్యాలెంట్ తో పోటీపడుతూ టాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ జెండా పాతేయాల్సి ఉంది.
-పర్వతనేని రాంబాబు✍️