Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Preity Zinta Comments on MeToo goes Viral

‘మీ టూ’.. సొట్టబుగ్గల సుందరిపై నెటిజన్లు ఫైర్‌!

ప్రీతి జింటా.. తెలుగు వారికే కాదు.. బాలీవుడ్‌ చిత్రాల ద్వారా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌. ఈమె తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమంలో భాగంగా ‘మీకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అలాంటి అనుభవాలు ఏమీ నాకు లేవు. ఉండి ఉంటే బాగుండేది. మీ ప్రశ్నకు సమాధానం దొరికేది’ అని కాస్త అసహ్యంగా నవ్వులు చిందించింది. 

ఇంకా ఆమె మాట్లాడుతూ, ‘మనం ఎలా ఉండాలని అనుకుంటామో.. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. బాలీవుడ్‌ ఇండస్ట్రీ హీరోయిన్లకు ఎంతో సురక్షితమైనది. కొంతమంది పబ్లిసిటి కోసం ఏమేమో మాట్లాడేస్తున్నారు....’ అని సమాధానం ఇచ్చింది. దాంతో ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘అయితే నెస్‌వాడియా విషయం ఏమిటి? అప్పుడు మీరు అతనిపై ఎందుకు కేసు పెట్టారు? తోటిమహిళవై ఉండి మిగిలిన వారి గురించి ఇలా ఎలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు? మొదట రాఖీసావంత్‌... ఇప్పుడు మీరు’ అని ఆమె తీరును తప్పుపడుతున్నారు. 

ఇలా సోషల్‌మీడియాలో తన వ్యాఖ్యలపై వస్తున్న తీవ్ర విమర్శలను తెలుసుకున్న ప్రీతిజింటా ఇప్పుడు నష్టనివారణ చర్యలకు పూనుకుంది. నా పూర్తి భావాలను, మాటలను చూపించకుండా వాటిని ఎడిట్‌ చేసి తన వ్యాఖ్యలను వారికి కావాల్సిన విధంగా మరల్చుకున్నారని తనని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ని, మీడియాను తప్పుపట్టింది. ఈ క్రమంలో ఈమె మీడియాపై వరుస ట్వీట్లతో విరుచుకుపడింది. కాగా ఐపిఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహయజమాని అయిన ప్రీతిజింటా 2014లో ఓ మ్యాచ్‌ సందర్భంగా వ్యాపారవేత్త నెస్‌వాడియా తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ప్రీతిజింటా కేసు పెట్టింది. అయితే ఇటీవలే కోర్టు నెస్‌వాడియాపై వేధింపుల కేసును కొట్టివేసింది. 

Preity Zinta Controversial Comments About #MeToo

Preity Zinta Comments on MeToo goes Viral
preity zinta
controversial comments
metoo
bollywood
actress