పవన్‌ సవాల్‌కి స్పందించే వారెవరు..?

మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రోజుకో వింత నాటకం ఆడుతున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఎత్తులు పైఎత్తులు, కల్లబొల్లి మాటలు అవసరమే గానీ అవి మోతాదుని మించి పోతున్నాయి. అసలు కేంద్రాన్ని చూస్తేనే చంద్రబాబు, జగన్‌లు వణికిపోతుండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం. జగన్‌ తాను అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నానని, అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 54 మంది ఎంపీల మద్దతు అవసరమని, మరి పవన్‌ టిడిపితో మాట్లాడి తమ అవిశ్వాస తీర్మానానికి టిడిపి ఎంపీల మద్దతుని ఇప్పించగలడా? అని ఘాటుగా ప్రశ్నించారు. దాంతో బొత్ససత్యనారాయణ, రోజాలు కూడా తానాతందానా అన్నారు. దానిపై పవన్‌ ఈ సవాల్‌ని స్వీకరిస్తున్నానని, అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది కాదు.. 50 మంది సరిపోతారని వ్యాఖ్యానించి, జగన్‌ అజ్ఞానాన్ని సున్నితంగా ఎత్తి చూపాడు. 

ఇక జగన్‌ ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పవన్‌ మౌనంగా ఉండటం ఆశ్యర్యకరం. బహుశా పవన్‌కి కూడా ఈ విషయంలో స్పష్టత లేదా అనేది ప్రశ్నార్దకం. ఇక పవన్‌ బిజెపిపై అవిశ్వాసం పెట్టండి.. అవసరం అయితే దేశం మొత్తం తిరిగి కమ్యూనిస్ట్‌లు, ఆప్‌, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ వంటి వారి మద్దతే కాదు... తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు, కాంగ్రెస్‌ మద్దతుని కూడా కూడగడతానని చెప్పడంతో సాయంత్రం కల్లా జగన్‌ డీలా పడిపోయి ఇక ఆ తర్వాత అవిశ్వాసం అనే మాటను ఆయన ప్రసంగాలలో లేకుండా చూసుకున్నాడు. మరోవైపు చంద్రబాబు తనదైన కొత్త నాటకానికి తెరదీశాడు. కేంద్రంపై అవిశ్వాసం అనేది చివరి అస్త్రంగా వాడాలని, ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగిపోతే ఆరునెలల వరకు దానిని మరలా ప్రవేశ పెట్టటానికి లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయినా సంవత్సరంలో ఎన్నికలు రానున్న వేళ అవిశ్వాసం పెట్టి ఓడిపోయినా ఇబ్బందేమిటో చంద్రబాబు చెప్పడం లేదు. నేడు ఖచ్చితంగా చంద్రబాబు, జగన్‌లు తమకున్న అవినీతి కేసుల వల్ల, ఓటుకు నోటు వల్ల కేంద్రాన్ని చూసి భయపడుతున్నారని సామాన్యుడికి కూడా అర్ధమవుతోంది. 

మరి ఇన్ని చెబుతున్న చంద్రబాబు, జగన్‌లు వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దానికి మరలా మద్దతు ఇవ్వరా? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే వీలుంటే జగన్‌ సోనియా శరణు కోరడా? చంద్రబాబు ఇప్పటికైనా తృతీయ ఫ్రంట్‌ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు? కనీసం వామపక్షాలకు కూడా చంద్రబాబు, జగన్‌లపై ఉన్న నమ్మకం పోవడం నిజం కాదా? అసలు ఇలాంటి వారి మీద నమ్మకాలు పెట్టుకోవడమే ప్రజల దౌర్భాగ్యం. సుజనాచౌదరి, సీఎం రమేష్‌, విజయసాయిరెడ్డి, చంద్రబాబు, జగన్‌లు ఉన్నంత కాలం ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడనే చెప్పాలి.

Pawan Kalyan Powerful Reply to YS Jagan Open Challenge

Pawan Kalyan Accepts Jagan Challenge
pawan kalyan
ys jagan
challenge
politics
chandrababu naidu