600కోట్ల సినిమాలో అన్నీ సంచలనాలే..!

త్వరలో మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో 600కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందనున్న మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. వాసుదేవనాయర్‌ రచించిన 'రాండామూజమ్‌' నవల ఆధారంగా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇది మహాభారతం ఆధారంగా రూపొందుతోంది. పౌరాణిక కథకు ఏమాత్రం వక్రీకరణలు లేకుండా ఈ నవల ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 

ఇక ఈ చిత్రానికి శ్రీకర ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తుండగా, పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలకు పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ భీముని పాత్రను చేయనుండగా, బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ భీష్మపితామహుని పాత్రను చేస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇంతకు ముందు మోహన్‌లాల్‌తో కలిసి అమితాబ్‌ హిందీలో 'ఆగ్‌', మలయాళంలో 'కాందహార్‌' చిత్రాలలో కలిసి నటించారు. 

ఇక ఈ చిత్రంలో పాండవులుగా నాగార్జునతో పాటు విక్రమ్‌ వంటి అన్ని భాషల హీరోలు నటించే అవకాశం ఉందని సమాచారం. ఇక కీలకమైన ద్రౌపది పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని నటించేందుకు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం సంచలనాలకు కేంద్రబిందువుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

mohanlal randamoozham
big b
nagarjuna
600 crores
aishwarya rai