హోదా ఉద్యమం...చిరుకు సంకటం..!

మెగాస్టార్ చిరంజీవికి సినిమా విజయోత్సాహం ఎక్కువ రోజులు మిగిలేట్టు లేదు. ఆయనకు ప్రమాదం ప్రత్యేక హోదా రూపంలో వస్తోంది. జనవరి 26న వైజాగ్ ఆర్కె. బీచ్లో జరిగే మౌన నిరసన దీక్షకు సమీకరణలు పెరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్కల్యాణ్ దీనికి పూర్తి మద్దతు ప్రకటించి, యువతను ఉత్సాహపరుస్తున్నారు. మెగా కంపౌండ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్తేజ్ కూడా అండగా నిలిచారు. హీరోల మద్దతు పెరుగుతున్న కొద్ది యువతలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అయితే ఇప్పుడు వారి దృష్టి చిరంజీవి వైపు మళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జల్లికట్టుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు ఇచ్చిన విధంగానే చిరు మద్దతు కోరాలని యువత నిర్ణయించినట్టు సమాచారం.
రాజ్యసభ సభ్యునిగా ప్రజాజీవితంలో ఉన్న చిరంజీవి సొంత రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2014 ఎన్నికల తర్వాత స్దబ్దుగా ఉన్న మెగాస్టార్కు ఇది సంకట స్థితి. ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీ నేత. కారణాలు ఏవైనా రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జరగాలంటే హోదానే మార్గమని అంతా భావిస్తున్న సమయమిది. ఈ పరిస్థితిలో చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి కలుగుతోంది. కాపు కులం కోసం రోడ్డెక్కిన చిరంజీవి హోదా కోసం బయటకు వస్తారని అభిమానులు సైతం భావిస్తున్నారు.
హోదా ఉద్యమానికి పవన్ కల్యాణ్ అండగా నిలవడం వల్ల తనది ద్వితీయ స్థానం అవుతుందనే సంశయం చిరంజీవిలో నెలకొనే అవకాశం ఉంది. ఖైదీ నంబర్ 150 చిత్రానికి అపూర్వ ఆదరణ ఇచ్చిన ప్రజల కోసం ఆయన ఇప్పటికైనా బయటకు వస్తారా ? అనేది చూడాలి.







































