టాలీవుడ్‌పై మలయాళ హీరోయిన్స్ దండయాత్ర..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌ అంటే ఉత్తరాది భామల కోసం దర్శకనిర్మాతలు, హీరోలు వెంపర్లాడేవారు. కానీ నేడు మాత్రం మలయాళ ముద్దు గుమ్మలు బాలీవుడ్‌ అమ్మాయిలకు గట్టిపోటీ ఇస్తున్నారు. వాస్తవానికి మొదటి నుండి మలయాళ ముద్దు గుమ్మలపై కూడా మనవారికి బాగానే గురి ఉంది. కానీ ఇప్పుడు వారి హవా బాగా సాగుతోంది. నిన్నటి వారిలో మలయాళ ముద్దు గుమ్మలైన నయనతార, ఆసిన్‌లు తెలుగులో ఓ వెలుగు వెలిగారు. ఇటీవలి కాలంలో నిత్యామీనన్‌ కూడా తనదైన ముద్ర వేసుకొంది.

ఇక 'నేను..శైలజ'తో టాలీవుడ్‌కు పరిచయమై, ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా నాని హీరోగా రూపొందుతున్న 'నేను..లోకల్‌' చిత్రంలో నటిస్తున్న సంచలన హీరోయిన్‌ కీర్తిసురేష్‌ అదరగొట్టే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంది. ఈమె ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంతో పాటు బన్నీ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికైందంటున్నారు. ఇక 'అ..ఆ, ప్రేమమ్‌' చిత్రాలలో నటించిన ప్రస్తుతం దిల్‌రాజు- శర్వానంద్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న 'శతమానం భవతి' చిత్రంలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న రామ్‌చరణ్‌ - సుక్కుమార్‌ చిత్రంలో, ఎన్టీఆర్‌-బాబిల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో అవకాశం దక్కించుకుందని సమాచారం. 'మజ్ను' చిత్రంతో తెలుగుకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్‌ కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 

ఈమె పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. అలాగే ఆమె ప్రస్తుతం రాజ్‌తరణ్‌ 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త', గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' చిత్రాలలో నటిస్తోంది. ఇక నాని 'జెంటిల్‌మేన్‌' చిత్రంతో పరిచయమైన నివేదాథామస్‌కు కూడా ఎన్టీఆర్‌-బాబిల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఆమెకు పలు ఆఫర్లు క్యూకడుతున్నాయి. మరి వీరిలో ఎంతమంది నయనతారలాగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలను ఏలుతారో...? చూడాల్సివుంది.

malayala heroines
nayanatara
kreethy suresh
nitya menen
anupama
emmanuelle
niveda thomas
pawan kalyan
nani
raj tarun
gopi chand
mahesh babu