పుత్రరత్నాల కోసం ఆ మాత్రం అవుతుంది మరి!

త్వరలో అంటే దసరా కానుకగా అక్టోబర్‌ 6న తెలుగు, కన్నడ భాషల్లో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్‌కుమార్‌గౌడను హీరోగా పరిచయం చేస్తూ, రాజమౌళి శిష్యుడు మహదేవ్‌ డైరెక్షన్‌లో దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న 'జాగ్వార్‌' విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'అల్లుడుశీను', నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అఖిల్‌' చిత్రం కోసం దాదాపు 40కోట్లు ఖర్చుపెడితే మనం ఆశ్చర్యపోయాం. కాగా 'జాగ్వార్‌'ను ఏకంగా 75కోట్లతో రూపొందిస్తు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆర్దికంగా ఎంతో బలమైన కుమారస్వామి తన తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సమయంలో ఈ చిత్రానికి ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆడియో విడుదలకు పవన్‌ హాజరుకాలేకపోయినా విశాఖలో జరిగే సక్సెస్‌మీట్‌కు హాజరవుతానని మాట ఇచ్చాడట. అంటే సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం ఎలా ఉన్నా.. భారీ ఎత్తున ఈ సక్సెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక తన కుమారుడు నటించే రెండో చిత్రాన్ని కూడా తెలుగులో టాప్‌ డైరెక్టర్లలో ఒకరు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక తనకు ఇష్టమైన హీరో పవన్‌కళ్యాణ్‌ హీరోగా కుమారస్వామి నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. మొత్తానికి నిఖిల్‌గౌడ బ్యాగ్రౌండ్‌ ఇలా ఉన్నప్పుడు ఆయన మొహాన్ని ప్రేక్షకులకు నచ్చేలా రుద్దేవరకు కుమార్‌స్వామి ఊరుకునేటట్లు కనిపించడం లేదు. 

nikhil kumar gowda
deva gowda
jaguar movie
bellamkonda suresh
nagarjuna
akhil
pawan kalyan