డైరెక్టర్ల గందరగోళానికి తెరపడినట్లేనా?
Is director finalized for Thalaivar 173
సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా ప్రకటించినప్పటి నుండి చిత్ర పరిశ్రమలో -అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈహైప్ కి రజనీ ఒక కారణమైతే? కమల్ హాసన్ మరో రీజన్ గా మారారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లోకనాయకుడు సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్- నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలైన తర్వాతే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి దర్శకత్వం వహించేది ఎవరనే విషయంలో మాత్రం కోలీవుడ్ వర్గాల్లో గందరగోళం కొనసాగుతోంది.
ఈ చిత్ర ప్రయాణం మొదలైనప్పటి నుంచి దర్శకుల కుర్చీ ఎందరో చేతులు మారింది. తొలుత ఈ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ సుందర్ సి పేరు ఖరారైంది. కానీ చివిరి నిమిషంలో భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా సుందర్ సి సినిమా నుండి తప్పుకున్నారు. అటుపై `పార్కింగ్` ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు పరిశీలనలోకి వచ్చినా అది వర్కవుట్ కాలేదు. అనంతరం `డాన్` సినిమా ఫేమ్ శిబి చక్రవర్తి చెప్పిన కథ నచ్చడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక వేదికపై ఈ ప్రాజెక్టుపై ఎంతో నమ్మకంగా మాట్లాడిన శిబి చక్రవర్తి కూడా కథా చర్చల్లో వచ్చిన మార్పుల వల్ల చివరకు మారిన దర్శకుల జాబితాలోకి చేరిపోయారు.
తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్షన్ బాధ్యతలు `ఓ మై కడవులే` చిత్ర దర్శకుడు అశ్వత్ మారిము త్తుకు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అశ్వత్ పుట్టినరోజున నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమాలో విలక్షణ దర్శకుడు మిష్కిన్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ పూర్తిగా కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకూడదని కమల్ హాసన్ భావిస్తున్నా? దాదాపు అశ్వత్ మారిముత్తు పేరే ఖరారైనట్లు తెలుస్తోంది.







































