హవాలా పై పూరి మ్యూజింగ్స్ నోట్

సముద్ర మార్గాలు కనుగొనక ముందు గుర్రాలు , గాడిదలపై నెలల తరబడి ప్రయాణిస్తూ వ్యాపారాలు సాగించే కాలంలో `హవాలా` వ్యవస్థ పురుడుపోసుకుంది. అప్పట్లో పట్టు వస్త్రాలు, బంగారం, మసాలా దినుసుల వంటి విలువైన వస్తువులను ఒక దేశం నుండి మరో దేశానికి తరలించే వ్యాపారులకు దారి దోపిడీ దొంగల భయం విపరీతంగా ఉండేది. తమ వెంట భారీగా నగదును తీసుకెళ్లడం ప్రాణాంతకమని భావించిన వ్యాపారులు డబ్బు తమతో పాటు ప్రయాణించకుండానే గమ్యస్థానానికి చేరే మార్గం కోసం ఆలోచించారు. ఈ క్రమంలోనే శతాబ్దాల క్రితం మిడిల్ ఈస్ట్లో ఒక వినూత్న పరిష్కారం లభించింది.. దాని పేరే హవాలా.
ఈ వ్యవస్థలో డబ్బు భౌతికంగా ఒక చోటు నుండి మరో చోటుకు కదలదు కానీ చేరాల్సిన వారికి క్షేమంగా అందుతుంది. ఒక నగరంలోని వ్యాపారి అక్కడ ఉన్న ఏజెంట్కు నగదు అందజేస్తే.. మరో నగరంలోని ఆ ఏజెంట్ భాగస్వామి అదే మొత్తాన్ని సదరు వ్యాపారికి చెల్లించేవాడు. ఇక్కడ వస్తువుల మార్పిడి జరుగుతుంది తప్ప.. నగదు ప్రయాణించదు. ఈ మొత్తం ప్రక్రియలో కరెన్సీ కంటే ఎక్కువగా ప్రయాణించేది కేవలం వ్యక్తుల మధ్య ఉండే `నమ్మకం` మాత్రమే. కేవలం ఆ నమ్మకమే పెట్టుబడిగా ఎటువంటి రికార్డులు లేకుండా ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ శతాబ్దాలుగా వర్ధిల్లుతోందని పూరి జగన్నాథ్ తన విశ్లేషణలో వివరించారు. కానీ ఈరోజుల్లో హవాలా మార్గంలో నల్లధనాన్ని విదేశాలకు తరలించే ప్రబుద్ధులు ఉన్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది.








































