కొత్త వైరస్ ముప్పు.. ప్రపంచంలో మహా కలకలం

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో `ఎంవి హోండియస్` క్రూయిజ్ షిప్లో బయటపడిన హంటావైరస్ (ఆండీస్ రకం) కలకలం రేపుతోంది. అర్జెంటీనా నుండి బయలుదేరిన ఈ నౌకలో వెలుగుచూసిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎనిమిది మందిలో ముగ్గురు మరణించడం దీని తీవ్రతను సూచిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటం..పైగా షిప్లో పలువురు భారతీయ నావికులు ఉన్నారనే వార్తలు భారత్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలుకల ద్వారా సోకే ఈ వ్యాధి, ఆండీస్ రకం కావడం వల్ల మనుషుల నుండి మనుషులకు కూడా పరిమితంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండటంతో మునుముందు మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ పర్యాటక రంగం విస్తరిస్తున్న వేళ... ఇలాంటి అరుదైన వైరస్ల నియంత్రణకు అంతర్జాతీయ ఆరోగ్య నియమాలలో సమూల మార్పులు అత్యవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం విమానాశ్రయాల్లో తనిఖీలే కాకుండా... వైరస్ పొదిగే కాలం ముగిసే వరకు ప్రయాణికులను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించే నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. నౌకలు -విమానాల్లో గాలి ప్రసరణ ఫిల్టర్లు, శానిటైజేషన్ ప్రమాణాలను కఠినతరం చేయాలి. వ్యాధి మూలాలను గుర్తించడం కోసం దేశాల మధ్య పారదర్శకమైన సమాచార మార్పిడి.. ఐక్యత మాత్రమే భవిష్యత్తులో గ్లోబల్ పాండమిక్స్ను అడ్డుకోగలవు. గతంలో నిఫా వంటి వైరస్లను విజయవంతంగా ఎదుర్కొన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పటిష్టమైన ముందస్తు చర్యలతో ఈ ముప్పును తిప్పికొట్టగలదని ఆరోగ్య నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ తో ప్రపంచానికి పెద్ద ముప్పు ఉండకపోవచ్చు.. కానీ జాగ్రత్తలు తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.








































