అమీర్‌పేటలో రోశయ్యకు ఊరట దొరికింది..!

దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి నమ్మినబంటుగా ఉన్న రోశయ్య.. ఊహించనిరీతిలో ఉమ్మడి రాష్ట్రం సీఎం పీఠమెక్కారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో లేదో.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఆయనకు ఊపిరి ఆడకుండా చేసింది. దీనికితోడు సీఎంగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా రోశయ్యపై అవినీతి ఆరోపణలను తెచ్చిపెట్టింది. హైదరబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసి విచారణ జరిపింది.

అటు తర్వాత ఏపీలో సీఎం పీఠానికి రోశయ్య దూరమైనా ఈ కేసు మాత్రం ఆయన్ను వీడలేదు. ముఖ్యమంత్రి పీఠం తర్వాత తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన ఆయన్ను ఈ కేసు వెన్నాడుతునే ఉంది. ఎట్టకేలకు ఈ కేసునుంచి రోశయ్య విముక్తలయ్యారు. అమీర్‌పేటలోని 9 ఎకరాల భూమి అప్పగింతలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ అవినీతి చోటుచేసుకుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని స్సష్టం చేసింది. దీంతో ఈకేసునుంచి రోశయ్యకు విముక్తి దొరికనట్లే కనిపిస్తోంది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆయనకు మళ్లీ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే ఏసీబీ సుప్రీంకోర్టు గడపతొక్కే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ కూడా ఈ కేసుకు సంబంధించి రోశయ్యకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

roshaiah
ameerpet
land scam
high court
Advertisement
Advertisement