ఎవరూ ఫిక్సింగ్‌ చేయలేదు..!!

ఫిక్సింగ్‌ కుంభకోణం ఐపీఎల్‌ను, ఇండియన్‌ క్రికెట్‌ను ఓ కుదుపు కుదుపింది. అప్పటివరకు సెలబ్రెటీ స్టేటస్‌ ఎంజాయ్‌ చేసి కోట్లకు పడగలెత్తిన పలువురు క్రికెటర్లు ఈ ఘటనతో పత్తా లేకుండా పోయారు. ఇక వీరిలో మొదటిగా వినిపించే పేరు శ్రీశాంత్‌. ఐపీఎల్‌ మొదటి టోర్నీలో చెంపదెబ్బతో ఎంతో ఫేమస్‌ అయిన శ్రీశాంత్‌ ఆ తర్వాత ఫిక్సింగ్‌ కోరల్లో చిక్కుకొని క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంతో ఇబ్బందుల్లో పడ్డ క్రికెటర్లందరికీ ఇప్పుడు ఊరట దొరికింది. ఢిల్లీ కోర్టు ఈ ఫిక్సింగ్‌ కుంభకోణంపై తీర్పునిస్తూ.. అసలు ఒక్క క్రికెటర్‌ కూడా ఫిక్సింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ కోర్టు తీర్పుపై శ్రీశాంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. తన నిర్దోషిత్వం బయపడిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కొని క్రికెట్‌కు దూరమైన మిగితా క్రికెటర్లు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిక్సింగ్‌తో వీరు క్రికెట్‌ ఆడకుండా బీసీసీఐ విధించిన నిషేధాన్ని కూడా ఇప్పుడు ఎత్తివేయక తప్పని పరిస్థితి. దీంతో ఈ క్రికెటర్లంతా ఈసారి ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

sreeshanth
ipl
fixing
delhi court