రేవంత్‌కు ఎదురుచూపులు తప్పడం లేదు..!!

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. శుక్రవారం కోర్టు ముందుకు వచ్చిన ఈ పిటీషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదులు గట్టిగా వాదించారు. ఇప్పటికే అనేక రోజులు రేవంత్‌రెడ్డి కస్టడీలో ఉన్నందునా బెయిల్‌ ఇవ్వాలంటూ రేవంత్‌ తరఫున న్యాయవాది వాదించగా.. రేవంత్‌ బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందంటూ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పారు.

అయితే ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలు ఆసక్తిరేకిత్తించాయి. అసలు లంచం ఎందుకు ఇవ్వజూపారు, పోటీ జరిగిన ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని, ఏ పార్టీకి ఎన్ని గెలిచే అవకాశాలుండే అంటూ ప్రశ్నించారు. మరువైపు రేవంత్‌ తరఫు న్యాయవాది ఇప్పటికే ఏసీబీ 15 మందిని విచారించినా ఎలాంటి సాక్ష్యాలను రాబట్టలేకపోయిందని, ఇది రాజకీయ కుట్రతో చేసిన కేసు అని ఆరోపించారు. కాబట్టి రేవంత్‌కు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదిస్తూ.. ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. నిందితుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉందని, ఆయన బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని వాదించారు. దీంతో కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

revanth reddy
bail petition
adjourned
acb court