ఫక్తు రాజకీయవేత్తలా లోకేష్‌బాబు..!!

లోకేష్‌బాబుకు టీడీపీలో రోజురోజుకూ ప్రాధాన్యత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈసారి నిర్వహించిన మహానాడులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రసంగం కూడా ఫక్తు రాజకీయవేత్తగా సాగింది. ఇక త్వరలోనే ఆయనకు పార్టీలో కీలక పదవి దక్కనుందని సమాచారం. టీడీపీ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నట్లు ఆ పార్టీ మీడియా కూడా కలరింగ్‌ ఇస్తోంది. ఇక చంద్రబాబు పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికావనుండటం ఖాయం కానుండటంతో ఇక లోకేష్‌కు ఎలాంటి పదవి దక్కనుందోనన్న ఆసక్తి టీడీపీ వర్గాల్లో నెలకొంది.

ఇక లోకేష్‌బాబు విషయనికొస్తే ఈ మధ్య కాలంలో జగన్‌ కంటే కూడా టీఆర్‌ఎస్‌పైనే ఆయన అధికంగా దృష్టిసారించారు. అనాధికారికంగా తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఆయన మోస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎక్కడ చాన్స్‌ దొరికినా టీఆర్‌ఎస్‌ నాయకులను విమర్శించడానికి ఆయన వెనుకాడటం లేదు. తాజాగా మహానాడులో లోకేష్‌బాబు మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీంతో కావాలనే కేసీఆర్‌ మహానాడుకు కరెంట్‌ కట్‌ చేశారని లోకేష్‌బాబు ఆరోపించారు. అయితే మహానాడులో వేదిక వరకు కావాల్సిన కరెంటును జనరేటర్ల సాయంతోనే ఏర్పాటుచేసుకున్నారు. జనరేటర్‌లో ఏదో సమస్య తలెత్తడంతోనే కరెంటు పోయింది. కాని ఈ విషయాన్ని పక్కనపెట్టి లోకేష్‌బాబు టీఆర్‌ఎస్‌ను విమర్శించి ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ఇక ఏది జరిగినా ఇతర పార్టీల నాయకుల వల్లేనని సాధారణంగా రాజకీయ నాయకులు ఆరోపిస్తుంటారు. ఇక లోకేష్‌బాబు తాను దీనికి మినహాయింపు కాదని నిరూపించుకున్నాడు.

lokesh babu
tdp
mahanadu
speech
kcr
Advertisement
Advertisement