ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు కాశ్మీర్ అంటే కేవలం మంచు కొండలు, అందమైన ప్రేమకథలకు చిరునామా. కానీ గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. వెండితెరపై ఎక్కువగా ఉగ్రవాదం, సరిహద్దు ఘర్షణల నేపథ్యాలే కనిపిస్తున్నాయి. కార్గిల్ యుద్ధం , ఆపరేషన్ సింధూర్ వంటి కీలక సైనిక చర్యల తర్వాత భారత సైన్యం ప్రధాన ఉగ్రవాద ముఠాలను సమర్థవంతంగా ఏరివేసింది. దీని పర్యవసానంగా కాశ్మీర్ లోయలో మునుపటి స్థాయిలో హింసాత్మక తీవ్రత తగ్గింది. నిత్యం మారణహోమం సృష్టించే ఉగ్రమూకల ప్రభావం తగ్గడంతో ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు కాశ్మీర్ సమస్యను నేరుగా చూపించడం కంటే గూఢచారి కథలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
టాలీవుడ్ విషయానికి వస్తే.. దక్షిణ భారత దర్శకులు కాశ్మీర్ను చూసే కోణం భిన్నంగా ఉంది. `సీతారామం` వంటి చిత్రాలు కాశ్మీర్ లోని మనోహరమైన లోయలను మళ్లీ స్వచ్ఛమైన ప్రేమకథలకు వేదికగా మలిచాయి. బాలీవుడ్లో కాశ్మీరీ గొంతుక లేదా అక్కడి స్థానిక పరిస్థితుల కంటే.. దేశభక్తిని ప్రేరేపించే గూఢచారి యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత పెరిగింది. ఉగ్రవాదంపై భారత్ సాధించిన పైచేయి కారణంగా.. ఒకప్పుడు కథల్లో కనిపించిన భయం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతోంది. అందుకే దర్శకనిర్మాతలు ఇటీవల కేవలం లోయలోని సమస్యల చుట్టూ కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో సాగే స్పై ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుత సినిమాల్లో కాశ్మీర్ ఒక సంఘర్షణాత్మక ప్రాంతం కంటే.. ఒక అందమైన లోకేషన్గా లేదా దేశ రక్షణలో కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగానే ఎక్కువగా కనిపిస్తోంది. తీవ్రవాదుల ఏరివేత తర్వాత అక్కడ నెలకొన్న ప్రశాంతత సినిమా కథల గమనాన్ని కొంతవరకూ మార్చేసింది. గూఢచారి కథలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో నిర్మాతలు వాస్తవ కాశ్మీరీ సమస్యల లోతుల్లోకి వెళ్లడం తగ్గించేశారు. వెండితెరపై కాశ్మీర్ అందాలు మళ్లీ మునుపటిలా వెలిగిపోతున్నా.. అక్కడి ప్రజల గొంతుక .. యథార్థ పరిస్థితులు ఈ గూఢచారి కథల వెనుక కనుమరుగవుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.




ఉచిత భోజనం, మద్యం కోసం ఆయన ఇంటికెళ్లేవాళ్లం!
Loading..