తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు - ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న విభేదాలు సమ్మె దిశగా దారితీస్తున్నాయి. ఆదాయ పంపిణీ విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రెంటల్ పద్ధతి వల్ల నిర్వహణ ఖర్చులు భరించలేకపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలో వసూళ్లలో నిర్దిష్ట శాతం వాటా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో ఈ కొత్త విధానం అమలు చేస్తేనే తాము మనుగడ సాగించగలమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఈ పరిణామం పట్ల యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయాలు, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నిర్మాతలు సతమతమవుతున్నారని, ఇలాంటి సమయంలో అదనపు భారం మోయడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. ఏప్రిల్ 30లోగా ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే సమ్మె ఖాయమని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తుండటంతో ఇండస్ట్రీలో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. ఈ ప్రతిష్టంభన వల్ల అటు నిర్మాతలు, ఇటు ప్రదర్శనకారులు ఆర్థికంగా భారీ నష్టాలను మూటగట్టుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ సమ్మె గనుక అమలులోకి వస్తే వేసవి సెలవులను టార్గెట్ చేసుకుని విడుదల కావాల్సిన క్రేజీ సినిమాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. నిఖిల్ సిద్ధార్థ్ ప్రతిష్టాత్మక చిత్రం `స్వయంభూ`, సమంత `మా ఇంటి బంగారం`తో పాటు `కొరియన్ కనకరాజు`, `సూర్య కరుప్పు` వంటి భారీ చిత్రాల విడుదలపై సమ్మె ప్రభావం పడనుంది. సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు అతిపెద్ద ఆదాయ వనరు కావడంతో ఈ వివాదం త్వరగా ముగిసి థియేటర్లు యధావిధిగా నడవాలని పరిశ్రమ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.




రకుల్ ప్రీత్ పంజాబీ లుక్ 
Loading..