తెర వెనుక హీరోలు తెరపైన కనిపిస్తే అంతేగా
Devisri Prasad - Lokesh Kanagaraj
చిత్ర పరిశ్రమలో ఒక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ప్రతిభావంతులు హఠాత్తుగా మరో క్రాఫ్ట్లోకి అడుగుపెట్టడం ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ చిత్రంతో అలాగే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ `డిసి` సినిమా తో నటులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
దశాబ్దాలుగా సంగీతంతో అలరించిన దేవీశ్రీ, వినూత్న చిత్రాలతో రికార్డులు సృష్టించిన లోకేష్ వంటి దిగ్గజ సాంకేతిక నిపుణులు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వారి మల్టీ-టాలెంట్ను మరో కోణంలో ఆవిష్కరించే వీలుంది.
అయితే నటనపై ఆసక్తి వారి అసలైన వృత్తిపై చూపే ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ వరుసగా నటనకు సంబంధించిన ప్రాజెక్టులు (డిసి, కత్తాలన్ సీక్వెల్) ఒప్పుకోవడం వల్ల అతడి డైరెక్టోరియల్ ఎబిలిటీ దెబ్బ తిని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలపై దృష్టి తగ్గే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఇదే విధంగా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా బిజీ అయిపోతే శ్రోతలు మెగా చార్ట్బస్టర్ ఆల్బమ్స్ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కొత్త టర్న్ రాంగ్ టర్న్ కాకూడాని అభిమానులు కోరుకుంటున్నారు. ఖైదీ 2-విక్రమ్ 2 లాంటి క్లాసిక్స్ ని లోకేష్ నుంచి ఆశిస్తున్న అభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. వారికోసం అతడు తిరిగి దర్శకత్వంలోకి రావాలనే కోరుకుందాం.







































