గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. పీసీ బాలీవుడ్ అగ్ర హీరోల సరసన అవకాశాల్ని కూడా కాదనుకుని తెలుగు సినిమాలో నటిస్తోంది. ఇంతకుముందు రాజమౌళి- మహేష్ లతో ఆన్ లొకేషన్ స్టిల్స్ ని షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
తాజాగా పీసీ బాలీవుడ్ లో వేతన వ్యత్సాసం గురించి మాట్లాడిన ఓ త్రోబ్యాక్ వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతోంది. ఇందులో తనకు మేల్ కోస్టార్ కి ఇచ్చిన పారితోషికంలో 10శాతం అయినా చెల్లించని రోజులు ఉన్నాయని వెల్లడించింది. హీరోలతో సమాన పారితోషికం తనకు ఎప్పుడూ ఏ నిర్మాతా ఇవ్వలేదని కూడా వెల్లడించింది. ఈ రంగంలో పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఎక్కువ.. ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. మేం మగ నటులతో సమానంగా పని చేస్తాము. అందుకే మా తరం నటీమణులు సమాన వేతనం గురించి అడిగారు. హీరోలకు తగ్గట్టుగా ఇవ్వాలని అడిగినా మాకు భత్యం ఇవ్వలేదు. ఇదొక్కటే కాదు... మేం సెట్లో గంటల తరబడి ఎదురు చూస్తుంటే, షాట్ కి ఎప్పుడు రావాలో హీరో నిర్ణయించే పరిస్థితి ఉంటుంది! అని కూడా పీసీ వ్యాఖ్యానించింది.
తన శరీర రంగు గురించి కూడా బాలీవుడ్ లో తొలి రోజుల్లో విమర్శించారని పీసీ తెలిపింది. నేను అంత అందంగా లేనని కామెంట్లు చేసారు. లేత రంగు ఉంటేనే కథానాయికగా అవకాశాలిచ్చేవారు. దీంతో నా తోటి నటుల కంటే నేను ఎక్కువగా శ్రమించాను.. అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను అని పీసీ తెలిపింది. తాను హాలీవుడ్ కి వెళ్లాక అక్కడ మగ నటులతో సమానంగా పారితోషికం చెల్లించారని కూడా వెల్లడించింది.