ఈరోజు మంగళవారం ఉదయం మెగా మదర్ అంజనమ్మ గారి ఆరోగ్యం బాలేదు అనే వార్త సోషల్ మీడియాలో కనిపించడమే తరువాయి, ఆమె చిన్న కొడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు అనే వార్త మీడియా ఛానల్స్ లో వైరల్ అయ్యింది. దానితో మెగా అభిమానులు అందోళన పడ్డారు.
కానీ అంజనమ్మ ఆరోగ్యంపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడమే కాదు.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు అన్న విషయమై కూడా స్పష్టత లేదు. ఇంకోపక్క అంజనాదేవి కాస్త అనారోగ్యానికి గురయ్యారని అయితే హాస్పిటల్ కు వెళ్ళాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారని, ఫ్యామిలీ డాక్టర్స్ వచ్చి ఇంట్లోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారంటూ ఛానల్స్ లో వార్తలు కనిపించాయి.
అదే సమయంలో రామ్ చరణ్ భార్య ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ నుంచి పచ్చళ్ళ తయారీ దృశ్యాలతో పాటు అందరూ కూర్చుని వాటిగురించి చర్చిస్తున్నట్లుగా, పచ్చడి రుచి చూస్తున్నట్లుగా ఉన్న వీడియో షేర్ చేసారు. ఆ వీడియో లో చిరంజీవి సతీమణి సురేఖ పక్కన తల్లి అంజనాదేవి కూర్చుని సరదాగా కోడలు వడ్డిస్తున్న పచ్చడి ఆరగిస్తుంటే.. రామ్ చరణ్ వెనుకవైపు నుండి గమనిస్తుంటే.. ఉపాసన చరణ్ తో మాట్లాడటం... తర్వాత రామ్ చరణ్ కూడా పచ్చడి రుచి చూస్తున్నట్లుగా ఆ వీడియో లో కనిపించడంతో అసలు అంజనమ్మ ఆరోగ్యం బావున్నట్లేనా, లేదంటే ఇలాంటి వీడియో ఉపాసన షేర్ చెయ్యరు కదా.. ఆమె అనారోగ్యం వార్తలపై ఎందుకింతగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.