భారతదేశ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అమానవీయ క్రూరమైన చర్య ఆ దేశానికి శాపంగా మారిందని చెప్పాలి. పహల్గామ్ అటాక్స్ లో 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని ఉగ్రవాదులు హరించారు. కానీ భారత్ దానికి ధీటుగా జవాబిచ్చింది. ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెసైంది. ఆ తర్వాత పాకిస్తాన్ గ్లోబల్ గా చాలా అవకాశాల్ని కోల్పోయింది. ఇండియా దాయాది దేశానికి అన్ని దారుల్ని మూసివేసింది. అలాగే కళాకారులకు కూడా దారులు మూసుకుపోయాయి.
పాకిస్తాన్ కి చెందిన చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులకు ఇప్పుడు ఇండియాలో అవకాశాల్లేవ్. బాలీవుడ్ సహా భారతీయ సినీరంగంలో యథేచ్ఛగా మనుగడ సాగించిన వారు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయారు. దేశాల మధ్య విద్వేషాగ్ని కళారంగాలను, కళాకారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఇప్పుడు పాకిస్తానీ నటి హనియా అమీర్ నటించిన భారతీయ చిత్రం `సర్దార్జీ 3` విడుదలకు చిక్కులేర్పడ్డాయి. దిల్జీత్ దోసాంజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో పాకిస్తానీ నటి హనియా అమీర్ కి అవకాశమివ్వడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో భారతదేశంలో ఈ సినిమా విడుదల కావడం లేదు. దీనిని విదేశాలలో మాత్రమే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కనీసం ఈ సినిమా ట్రైలర్ ని కూడా ఇండియాలో విడుదల చేయకపోవడం ఆశ్చర్యకరం. యూట్యూబ్ లో `సర్దార్జి 3` ట్రైలర్ ని అప్ లోడ్ చేసిన వ్యక్తి ఇండియాలో ఓపెనయ్యే ఆప్షన్ ఇవ్వలేదని చూపిస్తోంది. అయితే దీనికి చిత్రనిర్మాతలు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. పహల్గామ్ దాడికి ముందే హనియా అమీర్ ఈ సినిమాని పూర్తి చేసిందని, అయినా భారతీయుల మనోభావాలను దెబ్బ తీయకూడదనే ఈ సినిమాని భారతదేశంలో విడుదల చేయడం లేదని తెలిపారు. పాకిస్తానీ తారలు మహీరా ఖాన్, సనమ్ సయీద్, అలీ జాఫర్ వంటి వారికి భారతీయ సినీపరిశ్రమలో అవకాశాల్లేవ్.