సినీపరిశ్రమలో వివాదాలు ఎన్ని ఉన్నా చివరికి ఒక మంచి హిట్టు కొడితే చాలు.. తిరిగి పాజిటివ్ వైబ్స్ స్టార్టవుతాయి. వద్దు అనుకున్న నిర్మాత కూడా ఆ నటుడితో కలిసిపోతాడు. అలా ఒక వివాదాన్ని పరిష్కరించుకుని ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. దోస్తానా 2 చిత్రీకరణ సమయంలో కార్తీక్ ఆర్యన్ క్రమశిక్షణ లేని హీరో అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, ఆ తర్వాత అతడితో కలిసి పని చేయనని అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్తీక్ ఆర్యన్ భూల్ భులయా 2 సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో సత్తా చాటాడు.
అతడు సాధిస్తున్న విజయాలు అతడి చుట్టూ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. నటుడిగా అతడికి అవకాశాలకు కొదవేమీ లేదు. ఔట్ సైడర్స్ ని అడ్డుకునే వాళ్లు కూడా ఇతడిని సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మప్రొడక్షన్స్ కార్తీక్ ఆర్యన్ తో ఒక రొమాంటిక్ కామెడీని తెరకెక్కిస్తోంది. ఇందులో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తీక్- అనన్య జంట ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్ వర్కవుట్ అయిందనడానికి ఈ పోస్టర్ సింబాలిక్. కార్తీక్, అనన్య తీపి ముద్దుకు సాక్ష్యంగా ఇదిగో ఇలా పాస్ పోర్ట్ ని అడ్డుపెట్టుకుని కనిపిస్తున్నారు. పోస్టర్ ఆకట్టుకుంది. వెబ్ లో వైరల్ గా దూసుకెళుతోంది. ఇది రోడ్ ట్రిప్ జర్నీకి సంబంధించిన సినిమా. `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ`. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి విడుదల చేయాలనేది ప్లాన్.
ఇక కరణ్ జోహార్ ఔట్ సైడర్లకు అవకాశాలివ్వడు అనేది అసత్య ఆరోపణ. ఎవరైనా ఔట్ సైడర్ తనను తాను నిరూపించుకుని ముందుకు వెళితే కచ్ఛితంగా అతడు అవకాశాలిస్తాడు. ఇన్ సైడర్- ఔట్ సైడర్ టాపిక్ అన్ని పరిశ్రమల్లో మోగుతున్న ఈ సమయంలో ఇదే ఫార్ములా ఇటు టాలీవుడ్, ఇతర పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది. ఔట్ సైడర్ ప్రతిభావంతులకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీస్లో నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు.