సూపర్స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో `కూలీ` ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రను పోషించారు. ఇది భారీ మల్టీస్టారర్ మూవీ. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్, రజనీ పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు తెలిసాయి.
ఈ చిత్రం కోసం రజనీ దాదాపు 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ఇది ఇప్పటివరకు కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ `కూలీ` సినిమాకి రూ. 50 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇది ఒక దర్శకుడికి ఆల్ టైమ్ రికార్డ్ రెమ్యునరేషన్. మిగిలిన రూ. 150 కోట్లు సినిమాను నిర్మించేందుకు, ఇతర స్టార్-కాస్ట్ పారితోషికాల కోసం ఖర్చు చేశారు. కూలీ సినిమా మొత్తం బడ్జెట్, ప్రింట్ , పబ్లిసిటీని మినహాయించి రూ. 350 కోట్లు. నిర్మాతలు ప్రింట్, పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని, మొత్తం బడ్జెట్ రూ. 375 కోట్లకు చేరుకుందని కూడా కథనాలొస్తున్నాయి. కూలీ రికవరీ కూడా అద్భుతంగా ఉంది. ఇది సేఫ్ ప్రాజెక్ట్ అని కూడా గుసగుస వినిపిస్తోంది.
కూలీ చిత్రానికి ఓటీటీ సహా డిజిటల్ ప్లేయర్ల నుంచి 130 కోట్లు దక్కగా, శాటిలైట్ నుండి రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూపంలో రూ. 20 కోట్లు దక్కాయి. దీనితో మొత్తం నాన్ థియేట్రికల్ రికవరీలు రూ. 240 కోట్లకు చేరుకున్నాయి. థియేటర్ మాధ్యమం నుండి రూ. 135 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పరిగణిస్తోంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తమిళం, తెలుగు మరియు హిందీ భాషలతో పాటు ఇతర భారతీయ భాషలలో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తదుపరి రజనీ నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2 కోసం పని చేస్తున్నారు..