రీసెంట్ గా అమరావతి పునర్నిర్మాణ సభల్లో నమో మోడీ అంటూ ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ కి బుద్ది చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మినిస్టర్ నారా లోకేష్, పీఎం మోడీ ని పొగడడమే కాదు, ఈ విషయంలో తామెప్పుడూ మోడీ వెంటే ఉంటామని స్పష్టం చేసారు. మోడీ కూడా నారా లోకేష్ ను ఆప్యాయంగా పలకరించి తనని ఢిల్లీలో కలవమని చెప్పారు.
తాజాగా మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అవడంతో మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లి శనివారం సాయంత్రంప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించడమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది.
2024 ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది.యువగళం పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి, పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు.
ఈ భేటీలో ఏపీకి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా, జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు.
ఈ సందర్భంగా మోడీ తో కలిసి లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.