హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం, గణపతి మంత్ర పఠనం జీవన వైభవాన్ని అమోఘంగా మారుస్తాయని ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) పేర్కొన్నారు.
రాయదుర్గంలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్స్ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన శ్రీ అభయ గణపతి దేవాలయం (Sri Abhaya Ganapathi Temple)లో మూల విరాట్ ప్రతిష్టాపనకు ఆయన వేదవిదుల మంత్ర ధ్వనులమధ్య వైదిక సంప్రదాయానుసారం పూజార్చనలు జరిపారు.
ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ ప్రతికూల శక్తులని పరిహరింప చెయ్యడంలో గణపతి మంత్రశక్తి అపారమైందని చెప్పారు. మూడులోకాలు శరణుజొచ్చె గణపతి భగవానుని ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొనడంతో వొళ్ళు గగుర్పొడుస్తోందని శ్రీనివాస్ పారవశ్యంగా వివరించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఎమ్. రమేష్ రెడ్డి (M Ramesh Reddy IPS) మాట్లాడుతూ ఆపదలను దూరం చేసే అద్భుతాల అభయ గణపతిని అతి అరుదైన కృష్ణ శిలతో తయారు చేయించిన కాలనీ వాసుల్ని అభినందించారు.
ప్రసన్నపుణ్యమైన చైతన్యంతో ఈ ఆలయ ప్రాంగణం, పరిసరాలు శోభిస్తున్నాయని అభయ గణపతి ఆలయ సౌందర్యాన్ని, విశేషాల్ని రమేష్ రెడ్డి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి ఆలయ కమిటీ పక్షాన ఆలయ ప్రారంభకులు పురాణపండ శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు.
వందలాది భక్తుల సమక్షంలో అపూర్వంగా జరిగిన గణేశ హోమం, ప్రత్యేక పూజల్లో శ్రీ అమృతేశ్వరాలయం సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచించిన సహస్ర అపురూప గ్రంధాన్ని రమేష్ రెడ్డి ఆవిష్కరించి శ్రీనివాస్ నిర్విరామ పవిత్ర కృషిని అభినందించారు.
ఈ శ్రీకార్యంలో శ్రీ అభయగణపతి ఆలయ కమిటీ సభ్యులు జస్టిస్ డి.వి.ఆర్. వర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్, భాస్కర్ రెడ్డి, రాచకొండ రమేష్ , దాట్ల రవివర్మ, సంజయ్ కమటం, గొర్తి రవి ప్రసాద్, శ్రీనివాస్ రామ్ సాగర్, అమిత్ శర్మ, సందీప్ కమటం, శ్రీధర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తొలుత శృంగేరికి చెందిన మహా పండితులు ఎన్.ఎస్. శర్మ బృందం సుమారు మూడుగంటలపాటు ఆలయ ప్రతిష్టకు సంబంధించిన మంత్ర భాగాలతో సమస్త వైదిక కార్య కలాపాల్ని సంప్రదాయంగా నిర్వహించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది.
కృష్ణ శిలతో ఈ అభయ గణపతి ఆలయాన్ని నిర్మించడంలో శిల్పనైపుణ్యాన్ని ప్రదర్శించిన జయలక్ష్మీ ఆచార్యులను ఐజి. రమేష్ రెడ్డి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.