ఎన్టీఆర్ బావమరిది హీరోగా.. ఈసారైనా?

ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఇంతకు ముందు ఆయన హీరోగా ‘శతమానం భవతి’ వంటి చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీశ్రీ రాజావారు’ టైటిల్‌తో చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అప్పట్లో భారీగా వార్తలు దర్శనమిచ్చాయి. కానీ.. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు సినిమా చిత్రీకరణ జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా ఎక్కడా మాట్లాడలేదు. మరి ఆ సినిమా అటుంచితే.. ఇప్పుడు మాత్రం నార్నే నితిన్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్లే అనిపిస్తుంది. 

మొదటి సినిమా సంగతి అలా అవడంతో.. రెండో సినిమా విషయంలో నితిన్ కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులు దండిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఆయనే సమర్పకుడిగా వ్యవహరిస్తూ.. తన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్, దిల్ రాజు, చందూ మొండేటి, మారుతి వంటి వారంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

నార్నే నితిన్ సరసన న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం అంజిబాబు కంచిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కనుండగా.. రామ్ మిర్యాల సంగీతం అందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ సినిమా విడుదలైతే కానీ.. నార్నే నితిన్ సినిమా కెరీర్ ఏమిటనేది అర్థంకాదు.. మొదటి సినిమా విడుదలై ఉంటే.. ఈ పాటికే హీరోగా అతని కాలిబర్ ఏమిటనేది తెలిసిపోయేది. కానీ అది జరగలేదు. బహుశా.. ఈ రెండో సినిమా విడుదల తర్వాత.. ఆ సినిమా ఏమైనా లైన్‌లోకి రావచ్చేమో..

Jr NTR Brother in Law Narne Nithin Turns Hero

Narne Nithin Second Project Launched
narne nithin
jr ntr
brother in law
second film
launched