వలస కార్మికుల కోసం ముందుకొచ్చిన మనోజ్

వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తున్న హీరో మనోజ్ మంచు
మే 20 తన బర్త్డేను పురస్కరించుకొని హీరో మనోజ్ మంచు ఒక సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఎక్కడి వలస కార్మికులు అక్కడే ఆగిపోయారు. ఉపాధి లేక, స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అలాంటి వారిని ఆదుకోవడానికి మనోజ్ ముందుకు వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాద్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి రావడంతో, వాళ్లను సొంత ఊళ్లకు తరలించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
బుధవారం హైదరాబాద్లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురిని రెండు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. వాళ్లకు అవసరమైన ఆహారంతో పాటు మాస్క్లు, శానిటైజర్స్ను కూడా ఆయన అందజేశారు. ఆ కార్మికులు తమ ఇళ్లకు చేరేంతవరకు మార్గమధ్యంలో అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీమ్ కల్పిస్తున్నారు. ఇదే విధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి ఊళ్లకు బస్సుల్లో పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Manchu Manoj Helped Migrant Workers
Manoj Manchu Arranged Buses For Migrant Workers







































