‘దాసరి అవార్డ్స్’ బ్రోచర్ విడుదల

రాక్ స్టార్ ఈవెంట్స్ మరియు కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డ్స్ను ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్ మరియు వారి స్నేహితులు కలిసి అక్టోబర్ 26న శిల్పకళావేదికలో ‘దాసరి అవార్డ్స్’ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను సోమవారం తమ్మారెడ్డి భరద్వాజ మరియు రేలంగి నరసింహారావులు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్బంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలను తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘దర్శకరత్న మా గురువుగారైనటువంటి స్వర్గీయ దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఆయనకు ఇప్పటికీ అభిమానులు ఉండటం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఆయన పేరిట అవార్డ్స్ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో జరపనున్నారని ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్లు తెలిపారు. అయితే అక్టోబర్ 25న మా గురువుగారి సతీమణి స్వర్గీయ దాసరి పద్మగారి జయంతి కావున ఆ రోజున ఈ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. ఇకపోతే మా గురువు దాసరిగారికి రెండు కార్యక్రమాలు అంటే వల్లమాలిన ఇష్టం. అందులో ఒకటి ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం. రెండవది ప్రతియేటా మే 4న తన పుట్టిన రోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. దీనిని ఆయన బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ మిత్రులు అందరూ కలసి ప్రతి యేటా తప్పకుండా నిర్వర్తిస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమాలతో పాటు దాసరి అవార్డ్స్ కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.
ఈ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్గనైజర్లు (ఎన్ఆర్ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్లు పాల్గొన్నారు.
Relangi Narasimha Rao and Tammareddy Launches Dasari Awards Brochure
Dasari Awards Brochure Launched






































