తిత్లి తుఫాన్: అల్లు అర్జున్ 25 లక్షలు

తుఫాను భీభత్సంతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం ప్రాంత ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తిత్లి తుఫాన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారన్న విషయం తెలిసినా.. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా చలించిపోతారు స్టైలిష్ స్టార్. అవి మన తెలుగు రాష్ట్రాలైనా... పొరుగు రాష్ట్రాలైనా ఆయన స్పందించే తీరు మర్చిపోలేము.
గతంలో తమిళ్ నాడుకి 25 లక్షలు, కేరళ కి 25 లక్షలు తన వంతు సహాయం చేసి అభిమానుల చేత సదరన్ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు. అంతే కాకుండా వారికి సేవా కార్యక్రమాలపై స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. గతంలో, వైజాగ్లో వచ్చిన హుద్ హుద్ విపత్తుకి 20 లక్షలు ఇవ్వటమే కాకుండా ఉత్తరాఖండ్కి 10 లక్షలు ఇచ్చారు. ఇటీవల సంభవించిన చెన్నై తుఫాను బాధితులకు అండగా నిలిచి 25 లక్షలు సహాయం చేశారు. ఈ మధ్యే కేరళ వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వటమే కాకుండా వారిలో మనోధైర్యం నింపారు.
ఇక ఇప్పుడు తిత్లి తుఫాన్ శ్రీకాకుళం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే అల్లు అర్జున్కి మొదటి నుండి ప్రత్యేకమైన అభిమానం ఉంది. వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి తన ఔదార్యం చాటుకున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, అభిమానులంతా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పిలుపిచ్చారు.
Stylish Star Allu Arjun Donates Rs 25 Lakh For Victims of Cyclone Titli
Allu Arjun donates 25 lakhs for Titli cyclone victims







































