‘అరవింద సమేత’.. దీన్ని వర్ణించడానికి మాటల్లేవ్!

ఏమాటకామాటే చెప్పుకోవాలి... చిన్నపదంతోనే జీవితసారాన్ని చెప్పగలిగే నేటి పాటల రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన లెజెండ్, జీనియస్ లేరనే చెప్పాలి. ఏదో ప్రాస కోసం ప్రయాసలు పడుతూ, నానా చెత్త రాసే వారు ఎక్కువైన నేటిరోజుల్లో ఒక పాటలో జీవితసారాన్ని శాస్త్రి చాటిచెప్పి, తన కలానికి ఆకాశమే హద్దు అని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన రాసిన పాటకు పెంచలదాస్ అనే ఓ వ్యక్తి తన గాత్రం ద్వారా జీవం పోశాడు. ఇది ‘అరవింద సమేత వీరరాఘవ’ నుంచి విడుదలైన మూడో లిరికల్ సాంగ్ని వింటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
అనారోగ్యకారణాల రీత్యా పాటలు రాయడం తగ్గించిన శాస్త్రి మరోసారి తన అభిమానులందరికీ అద్భుతమైన కానుక ఇచ్చారు. ‘ఏ కోనలో కూలినాడో..ఏ కొమ్మలో చేరినాడో.. ఏ ఊరికో, ఏ వాడకో, ఏడ బొయ్యాడో... రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం.. ’ అంటూ సాగిన ఈ లిరికల్ సాంగ్ని వర్ణించడానికి పదాలు సరిపోవనే చెప్పాలి. బహుశా దీనిని వర్ణించాల్సి వస్తే దానిని కూడా శాస్త్రిగారే వర్ణించగలరేమో అని చెప్పడం అతిశయోక్తికాదు. ఈ అద్భుత గీతాన్ని రాసిన సిరివెన్నెల ఈ వీడియోలో మాట్లాడుతూ, ‘కత్తి మీద సామే నడకనుకుంటే.. పాడె పడకవుతుంది... ఆ పాడె మీద పడుకున్న వాడిని చూసి అయిన వాళ్ల కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట’ అని తానే ఆ పాటకు భాష్యం చెప్పారు.
ఈ పాటను పాడే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్న పెంచలదాస్ మాట్లాడుతూ.. ఈ పాటను నన్ను పాడమనడం నా అదృష్టం. బతుకుకు ఓ సారాంశమైన పాట అని భావించాను అని చెప్పుకొచ్చాడు. ఇక తనలో ఇంత ప్రతిభ దాగి ఉందని నిరూపించుకుని సెహభాష్ అనిపించుకున్న సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, ఈ పాటను పాడిన పెంచలదాస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అద్భుతంగా పాడారు.. అని కితాబునిచ్చాడు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ‘అనగనగా అరవింద తన పేరు’, ‘పెనిమిటి’ లిరికల్ వీడియోస్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచిన నేపధ్యంలో తాజాగా విడుదలైన పాట ఆ అంచనాలను ఆకాశాన్నితాకే స్థాయికి తీసుకెళ్లిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Seetharama Sastri penned Song for Aravinda Sametha movie
Aravinda Sametha 3rd lyrical Song Released







































