ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actress Divyavani About Her Role in Mahanati

నిడివి తక్కువని అస్సలు ఆలోచించలేదు : దివ్యవాణి!

తెనాలికి చెందిన నటి దివ్యవాణి. ఈమె 'పెళ్లిపుస్తకం'తో పాటు పలు మంచి గుర్తుండి పోయే చిత్రాలలో నటించి బాపుబొమ్మగా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం క్రిస్టియన్‌ మతం ప్రచారంలో పాల్గొంటూ ఉంది. ఇక ఈమె తాజాగా 'మహానటి' చిత్రంలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ఈమె తాజాగా మాట్లాడుతూ, జనరేషన్స్‌ని బట్టి అన్ని మారుతుంటాయి. 'బాహుబలి' విషయానికి వస్తే టెక్నికల్‌గా ఈచిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచింది. 'మహానటి'లో సహజత్వం కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ద కనిపిస్తుంది. 

అప్పట్లో సెట్‌లోని అందరి మధ్య కుటుంబ తరహా వాతావరణం ఉండేది. కలిసి పనిచేస్తున్న అందరం కష్టసుఖాలను చెప్పుకునే వారిమి. ఇప్పుడంతా నీతో మాట్లాడితే నాకేంటి అన్నతరహాగా మారిపోయింది. ఎవరికి వారు తమకు కేటాయించిన కారవాన్‌లలో వెళ్లి కూర్చుంటున్నారు. అప్పట్లో ఉన్న ఆప్యాయతలు, పలకరింపులు, బంధాలు, అనుబంధాలు ఇప్పుడు కనిపించడం లేదు అంతే. ఇక దివ్యవాణి 'మహానటి' చిత్రంలో సావిత్రి తల్లిపాత్రను పోషించింది. 

దీని గురించి ఆమె చెబుతూ, ఒక రోజు స్వప్నాదత్‌గారు నాకు ఫోన్‌ చేశారు. సావిత్రి గారి తల్లి పాత్రను చేయాల్సి వుంది రమ్మన్నారు. ఆ మర్నాడు సాయంత్రం ఆమెని కలవడం, ఓకే చేయడం అయిపోయాయి. రీఎంట్రీతో నిడివి తక్కువగా ఉన్న పాత్రను పోషించడం సమంజసమేనా? అనినేను ఆలోచించలేదు. ముఖ్యమైన పాత్ర, మంచి బేనర్‌ వంటివే దృష్టిలో ఉంచుకున్నాను. ప్రాధాన్యం ప్రకారం చూసుకుంటే కీర్తిసురేష్‌, రాజేంద్రప్రసాద్‌ల తర్వాత నేను పోషించిన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. చాలారోజుల తర్వాత రాజేంద్రప్రసాద్‌ గారితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది. 

Divyavani Latest Interview Updates

Actress Divyavani About Her Role in Mahanati