ఇద్దరు స్టార్స్‌ తీవ్రంగా నష్టపోయారు..!

జనవరి25న బాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన షారుఖ్‌ఖాన్‌ నటించి, నిర్మించిన 'రాయిస్‌', హృతిక్‌రోషన్‌ హీరోగా నటించి, నిర్మించిన 'కాబిల్‌' చిత్రాలు రెండూ ఒకే రోజున బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు భారీనష్టం తప్పదని, కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలని పలువురు ఇండస్ట్రీ మంచిని కోరే వారు సలహా ఇచ్చారు. కానీ ఈ ఇద్దరు వినలేదు. ఈ చిత్రాల విడుదలకు ముందే ఈ పోటీ వల్ల తమ 'కాబిల్‌' చిత్రానికి నష్టాలు తప్పవని నిర్మాత, హృతిక్‌రోషన్‌ తండ్రి రాకేష్‌రోషన్‌ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు అనుకున్నంత జరిగింది. వాస్తవానికి 'కాబిల్‌, రాయిస్‌' రెండు చిత్రాలు పాజిటివ్‌ టాక్‌నే తెచ్చుకున్నాయి. 

అయినా ఈ రెండింటికి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవు. తన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' తోపాటు విమర్శలు ఎదుర్కొన్న 'హ్యాపీ న్యూఇయర్‌' చిత్రాలు సైతం షారుఖ్‌ స్టామినాకు తగ్గట్లు రెండు మూడురోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద 100కోట్లను సాధించాయి. కానీ 'రాయిస్‌'కు మాత్రం 100కోట్లు రాబట్టేందుకు వారం పట్టింది. ఇక హృతిక్‌ నటించిన 'కాబిల్‌'కైతే 100కోట్లు సాధించడానికి ఏకంగా 12 రోజులు పట్టింది. నిజానికి ఈ చిత్రాలు విడివిడిగా విడుదలై ఉంటే ఇవి 300కోట్లను ఈజీగా దాటగలిగేవి. మొత్తానికి ఈ పోరులో షారుఖ్‌, హృతిక్‌ ఇద్దరు భారీగా నష్టపోయారు. ఈ రెండు చిత్రాలకు కలిపి కనీసం 300 కోట్ల వరకు నష్టం వాటిల్లనుందని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు లెక్కలతో సహా వివరిస్తున్నాయి. ఇలాంటి తమ పోరు కనీసం భావితరాలకైనా, ఇతర స్టార్స్‌కయినా భవిష్యత్తులో కనువిప్పు కావాలని స్వయంగా ఈ చిత్రం విడుదలకు ముందే హృతిక్‌ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ గుణపాఠం కేవలం బాలీవుడ్‌కే కాదు.. కోలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్స్‌కి కూడా కనువిప్పు కలిగించాలి. 

hrithik roshan
shahrukh khan
raees movie
kaabil movie
bollywood stars
tollywood stars
kollywood stars