వారి నమ్మకం వమ్ము కాలేదు..!

కరెన్సీ కష్టాల సమయంలో ఎంతో సాహసం చేసి, సినిమా మీద ఉన్న నమ్మకంతో డేరింగ్‌గా విడుదలైన యంగ్‌హీరో నిఖిల్‌ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని, సంచలనం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 7కోట్ల బడ్జెట్‌తో లోబడ్జెట్‌ ఫిల్మ్‌గా విడుదలైన ఈ చిత్రం 30కోట్లకు పైగా వసూలు చేసి, తాజాగా 50రోజులను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయంలో దీని శాటిలైట్‌ హక్కుల కోసం కొన్ని ఛానెల్స్‌ యాజమాన్యాలు నిర్మాతలతో బేరసారాలు సాగించాయి. కానీ వారు మరీ తక్కువ రేట్లను ఆఫర్‌ చేయడంతో దర్శనిర్మాతలతో పాటు నిఖిల్‌ కూడా సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం, ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ఆత్మవిశ్వాసంతో తొందరపడి తక్కువరేటుకు శాటిలైట్‌ రైట్స్‌ అమ్మకూడదని, సినిమా విడుదలైన తర్వాతే అమ్మాలనే డేరింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. వారు ఈ విషయంలో పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఇప్పుడు పలు ఛానెల్స్‌ వారు ఫ్యాన్సీ రేట్లను ఆఫర్‌ చేస్తూ ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులు పొందాలని పోటీపడుతున్నారు. ఈ సమయంలో జీటీవీ చానెల్‌ వారు ఈ చిత్రం హక్కులను ఏకంగా 4కోట్లకు తీసుకున్నారని తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా డబ్బులు కేవలం శాటిలైట్‌ ద్వారానే రావడంతో నిర్మాతలు జాక్‌పాట్‌ కొట్టినట్లయింది. ఈ చిత్రం తమిళ, కన్నడ, హిందీ రీమేక్‌ రైట్స్‌ కోసం కూడా తీవ్రపోటీ మొదలైందని సమాచారం. మొత్తానికి కేవలం శాటిలైట్‌, రీమేక్‌ రైట్స్‌ ద్వారానే ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌ నిర్మాతలకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

young hero nikhil
ekkadiki pothavu chinnavada movie
super hit movie
producers very happy