హీరో కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కే ఎక్కువ..!

ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి నటనలో, అందంలో శ్రీదేవి, జయప్రద వంటి వారికి కూడా ఎంతో పోటీనిచ్చిన సహజనటి జయసుధ. కాగా ప్రస్తుతం ఆమె తల్లి వేషాలు, అత్త, బామ్మల పాత్రలు పోషిస్తోంది. ప్రస్తుతం 'బిచ్చగాడు' నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు స్వయం కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో విప్లవనాయకుడు ఆర్‌.నారాయణమూర్తితో 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా సహజంగా సినిమా ఫీల్డ్‌లో హీరోలకే ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఉంటుంది. కానీ జయసుధ మాత్రం ఈ చిత్రంతో ఆ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో ఆమె నారాయణమూర్తికి భార్యగా నటిస్తోంది. దీనిలో నటించడానికి మొదట జయసుధ ఒప్పుకోలేదు. ఇటీవల షూటింగ్‌ సమయంలో కూడా జయసుధ దర్శకనిర్మాతలపై అలిగి, సెట్స్‌ నుంచి వెళ్లిపోవడం పెద్ద సంచలనమే సృష్టించింది. 

జయసుధకు ఈ పాత్ర చేయాలని ఇష్టం లేనప్పటికీ ఇందులో ఆమె నటిస్తేనే చిత్రానికి నిండుదనం, ఆకర్షణ వస్తాయని భావించిన దర్శకనిర్మాతలు ఆమెకు ఏకంగా 75లక్షలు ఇచ్చారట. దాంతో జయసుధ మెత్తబడిందని అంటున్నారు. సాధారణంగా జయసుధ తీసుకునే రెమ్యూనరేషన్‌, ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా, శర్వానంద్‌ హీరోగా సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో రూపొంది, సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న చిత్రం 'శతమానం భవతి' చిత్రానికి ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌ కంటే రెండింతలు ఎక్కువని సమాచారం. ఇందులో సగం కూడా హీరో అయిన పీపుల్స్‌స్టార్‌కు ఇవ్వలేదట. కాగా ఇందులో ఆమె నారాయణ మూర్తికి భార్యగా నటిస్తుండగా, 'శతమానం భవతి'లో మాత్రం ప్రకాష్‌రాజ్‌ భార్యగా, శర్వానంద్‌కు బామ్మగా కనిపించనుంది. ఈ విషయం ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి రేసులోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.మరి సంక్రాంతికి ఈ సినిమా పోటీలో ఉంటుందా...? థియేటర్లు లభిస్తాయా? అనే దానిపై ఈ చిత్రం రిలీజ్‌ ఆధారపడి ఉంది. 

jayasudha
prakash raju
r narayana murthi
head constable venkatramaiah movie
shatamanam bhavathi movie