ఇప్పటికైనా సెటిల్ అవుతుందా..!

అనసూయ బుల్లితెర మీద గ్లామర్ షో తో తనదైన ముద్ర వేసింది. యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై తన అందచందాలతో వెండితెర మీద ఒక వెలుగు వెలగాలని కలలు కంటుందీ భామ. అందుకే తన పద్దతిలో ఫోటో షూట్స్ తో అందాల ఆరబోతలో హీరోయిన్స్ ని మించిపోయి మరీ ఎక్సపోసింగ్ చేస్తూ వెండితెర అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ ఏడాది అనసూయ నాగార్జున సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన'లో ఒక మెరుపు మెరిసింది. ఇక అడివి శేష్ హీరోగా వచ్చిన 'క్షణం' చిత్రంలో ఒక కీ రోల్ పోషించింది. ఈ చిత్రాలతో అనసూయ నటనతో అందరిని మైమరపించింది. అయితే అమ్మడికి పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. అయినా నిరాశపడకుండా తన ప్రయత్నాల్లో బిజీగా వున్న అనసూయకి సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో ఐటెం సాంగ్ కి అవకాశం వచ్చింది. ఇక బుల్లితెర మీద బిజీగా ఉంటూనే మరో పక్క వెండితెర మీద కూడా బిజీగా మారింది. ఇక ఇప్పుడు మరో అవకాశం అనసూయని వెతుక్కుంటూ వచ్చిందని చెబుతున్నారు.
'క్షణం' సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నఅడవి శేష్ మరో విభిన్నమైన చిత్రంలో నటించడానికి రెడీ అయ్యాడట. ఇక 'క్షణం' లో అనసూయ, అడవిశేష్ కలిసి నటించారు. అయితే ఇప్పుడు అడవిశేష్ నటించే తాజా చిత్రంలో అనసూయని హీరోయిన్ గా అడవిశేష్ పక్కన సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంటే అమ్మడు అడవి శేష్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యిందన్నమాట. ఇక ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ఈ అవకాశంతోనైనా అనసూయ వెండితెర మీద బిజీ అవుతుందేమో చూద్దాం.







































