బుర్రంటే అది నాగ్‌దే..!

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని సపోర్ట్‌ చేయడంలో ఆరితేరిన మొనగాడు కింగ్‌ నాగార్జున. ఆయన ఇటు బిజినెస్‌మేన్‌గా, హీరోగా బిజీగా ఉంటూనే మరోపక్క తన ఇద్దరు కుమారుల కెరీర్‌లను చక్కబెడుతూ, నిర్మాతగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన త్వరలో రాజకీయాలలోకి రానున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరలో జగన్‌ నేతృత్వంలోని వైయస్సార్‌సీపీలో చేరనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఆయనకు గతంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మరీ ముఖ్యంగా సీఎం వైఎస్‌కి లోపాయికారీగా మద్దతు తెలపడమే కాదు... రాజన్న తీసుకున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు ప్రచారకర్తగా పనిచేసి, వైఎస్‌ జమానాలో కూడా ఆయన తన వ్యాపారాభివృద్దికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కబెట్టుకున్నాడు. 

అయితే ఆయన ఎక్కువగా హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆయన ఎక్కువగా కేసీఆర్‌ను మచ్చిక చేసుకున్నాడు. ఇక ఆయనకు పెద్దగా ఏపీ సీఎం చంద్రబాబుతో గానీ, టిడిపితో కానీ ప్రస్తుతానికి పనిలేదు. కాబట్టి టిడిపిని సపోర్ట్‌ చేయాల్సిన అవసరం ఆయనకు కనిపించడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు అండ కోసం టిడిపికి మద్దతుపలికితే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు కోపం వస్తుంది. కాబట్టి ఆయన ఏపీ ముఖ్యమంత్రిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దేశంలో రాబోయేది మోదీ సర్కారే అని ఎన్నికలకు ముందే ఊహించిన ఆయన ముందుగానే మోదీని కూడా మచ్చిక చేసుకున్నాడు. ప్రస్తుతం ఏపీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును దువ్వే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇక విషయానికి వస్తే ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టిడిపి గెలవదని, వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గెలిచి, దాని అధినేత జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన భావిస్తున్నాడు. అంతేగాక జగన్‌ సన్నిహితులతో నాగ్‌కు మంచి వ్యాపారబాంధవ్యాలు కూడా ఉన్న సంగతి బహిరంగ విషయమే. మరోవంక ఆయన తనయుడు అఖిల్‌ వివాహం త్వరలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకె మనవరాలు శ్రియాభూపాల్‌తో జరుగనుంది. దీంతో ఆయనకు జగన్‌తో అనుబంధం మరింత బలపడుతుంది. అందుకే నాగ్‌ని వైకాపాలో చేర్చుకోవాలని జగన్‌ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడంటున్నారు. అందుకు నాగ్‌ ఒప్పుకుంటే ఆయనకు గానీ, లేదా ఆయన శ్రీమతి అమలకు గానీ గుంటూరు ఎంపీ సీటును వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇస్తానని జగన్‌ ఇప్పటికే నాగ్‌కు సంకేతాలు పంపాడంటున్నారు. 

ఏపీ రాజధాని ఏరియా అయిన గుంటూరు నుంచి గెలిస్తే ఇక తమకు కీలకమైన, ఖరీదైన ఏపీ రాజధాని అమరావతిలో పట్టు వచ్చి, దానిని తన వ్యాపార సామ్రాజ్యానికి వేదికగా ఉపయోగించుకునే దూరదృష్టితో నాగ్‌ ఉన్నాడట. కానీ ప్రస్తుతం జగన్‌ పలు అవినీతి ఆరోపణలతో ఈడీ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికలలోపు జగన్‌ పరిస్థితి ఏమిటో అర్ధం కాని అయోమయస్థితి నెలకొంది. దాంతో నాగ్‌ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో వచ్చే ఎన్నికల ముందువరకు తొందరపడకుండా ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నాడని సమాచారం. మొత్తానికి బుర్రంటే అది నాగ్‌దే అని అంటూ సెటైర్లు అప్పుడే మొదలయ్యాయి. 

akkineni nagarjuna
wife amala
ts cm kcr
ap cm chandrababu nayudu
ysr jagan
akhil
gvk