మరోసారి ఆ యంగ్‌హీరో తప్పుచేస్తున్నాడు..!

హీరోకు మార్కెట్‌ లేకపోయినా టాప్‌ డైరెక్టర్‌ ఉంటే చాలు ఆ హీరో మార్కెట్‌తో పనిలేకుండా కొందరు నిర్మాతలు, వారి తంద్రులు విపరీతమైన బడ్జెట్‌ను పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇక వివాదాస్పద నిర్మాత బెల్లకొండ సురేష్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ దాదాపు 40కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టి, మాస్‌ డైరెక్టర్‌ వినాయక్‌తో 'అల్లుడుశీను' చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ భారీ బడ్జెట్‌ వల్ల బాగా నష్టాలను మిగిల్చింది. 

ఇక ఆ హీరో నటించిన రెండో చిత్రం 'స్పీడున్నోడు' ఫ్లాప్‌ అయింది. ప్రస్తుతం ఈ యువహీరో డైనమిక్‌ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాతగా ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. పేరుకు రవీంద్రరెడ్డి నిర్మాత అయినప్పటికీ ఈ చిత్రానికి బినామీ ప్రొడ్యూసర్‌ ఆయన తండ్రి బెల్లంకొండ సురేషే అన్నది అందరికీ తెలిసిందే. బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ను ఎలాగైనా మాస్‌ హీరోని చేయాలని నిర్ణయించుకున్న ఆయన తండ్రి తన కుమారుడి కోసం భారీ బడ్జెట్‌ను, టాప్‌ హీరోయిన్స్‌ను, బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్టులను, హై రేంజ్‌ టెక్నికల్‌ టీమ్‌ను పెట్టుకున్నాడు.

ఈ చిత్రం కోసం కూడా డబ్బును నీళ్లగా ఖర్చుచేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌కే కాదు.. దర్శకుడు బోయపాటికి కూడా ఎవ్వరూ ఊహించనంత మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, తమిళ సీనియర్‌ స్టార్‌ శరత్‌కుమార్‌లను కూడా తీసుకొని వారికి కూడా అడిగింత మొత్తం ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ, రిషి పంజాబీ వంటి హైటెక్నికల్‌ టీం పనిచేస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. 

bellam konda sai srinivas
bellam konda suresh
boyapati srinu
dwaraka creations banner
producer miryala ravinder reddy
music composer devi sri
heroines rakul preet singh
pragya jaiswal