పాపం...వాళ్ళని పవన్‌ పరుగెత్తిస్తున్నాడుగా..!

ఒకప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఏడాదికో రెండేళ్లకో ఓ చిత్రం చేసేవాడు. దాంతో దర్శకనిర్మాతలు కూడా ఆయన జోడీ విషయంలో గానీ, ఇతర ఆర్టిస్టుల ఎంపికలో గానీ నిదానంగా నిర్ణయాలు తీసుకునేవారే గానీ హడావుడి పడేవారు కాదు. కానీ ప్రస్తుతం త్వరలో పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి వెళ్లాలనే నిర్ణయంతో పవన్‌ ఆలోపు వీలైనన్ని చిత్రాలను తొందరగా లైన్‌లో పెడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఏకంగా ఒకేసారి మూడు చిత్రాలను సిద్దం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించే ఈ మూడు చిత్రాల దర్శక, నిర్మాతల విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ ఒకేసారి మూడు చిత్రాలు అనేసరికి ఈ చిత్రాల దర్శకనిర్మాతలకు పవన్‌కు జోడీని వెతికే విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెట్స్‌పై ఉన్న డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న 'కాటమరాయుడు'లో 'గబ్బర్‌సింగ్‌' జోడీ శృతిహాసన్‌ను ఎంపిక చేసుకుని, వేగంగా షూటింగ్‌ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌ హ్యాట్రిక్‌ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసేందుకు ఎంతగానో కిందామీదా పడ్డ త్రివిక్రమ్‌ చివరకు కీర్తిసురేష్‌, అను ఎమ్మాన్యుయెల్‌లను ఎంపిక చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత తమిళ 'వేదాళం'కు రీమేక్‌గా ఎ.యం.రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నీసన్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా మొదట రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు వినిపించింది. మెగా కాంపౌండ్‌ హీరోయిన్‌ కావడంతో ఆ వార్త నిజమేనని అందరూ భావించారు. కానీ సడన్‌గా ఆ స్దానంలో 'అఖిల్‌' ఫేమ్‌ సాయేషాసైగల్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇలా పవన్‌కి జోడీలను వెతకడంలో దర్శకనిర్మాతలు నానా పాట్లు పడుతున్నారు. మరి వీటిల్లో ఎంత మాత్రం నిజముందో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే దాకా చెప్పలేం. 

pawan kalyan
heroines
pawan kalyan politics
pawan kalyan movies