చరణ్‌ గోల్‌ ఎంతవరకు నెరవేరుతుంది..?

రామ్‌చరణ్‌ తాజాగా చేసిన 'ధృవ' చిత్రం విభిన్న చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల నుండి మంచి స్పందననే రాబడుతోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా ఈజీగా మిలియన్‌ మార్క్‌లను అందుకుంటుంటే చరణ్‌కు ఇప్పటివరకు ఓవర్‌సీస్‌లో ఒక్క మిలియన్‌ మార్క్‌ చిత్రం కూడా లేదు. చివరకు 'మగధీర' చిత్రం కూడా అక్కడ దాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈసారి 'ధృవ' చిత్రం విషయంలో చరణ్‌ తెలుగు రాష్ట్రాలపై కంటే ఓవర్‌సీస్‌లో ప్రమోషన్‌పైనే బాగా దృష్టి పెట్టాడు. ఈ చిత్రం కోసం అమెరికాలో ఉన్న ఆయన అక్కడి అభిమానులు, ప్రేక్షకులతో కలిసిపోతూ, అక్కడి షోలకు హాజరు అవుతుండటం కూడా ఈ చిత్రానికి యుఎస్‌లో మంచి కలెక్షన్లు రావడానికి దోహదపడుతోందంటున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో యుఎస్‌లో ఈ చిత్రం మిలియన్‌ మార్క్‌ను అందుకోనుందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. కాగా 'ధృవ' చిత్రం తర్వాత కూడా చరణ్‌ కొత్తదనం దారిలోనే అడుగులు వేస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం సుకుమర్‌తో మొదలుకానుంది. ఈ చిత్రం కూడా 1980ల నాటి ఓ ప్రేమకథా చిత్రంగా, సుకుమార్‌ స్టైల్‌లో విభిన్నంగా రూపుదిద్దుకోనుంది. ఆ తర్వాత మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ చిత్రం కూడా ఓ టిపికల్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. వీటితో పాటు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు, క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నంతో ఓ చిత్రం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైవిధ్యభరిత చిత్రాలను అందరూ మెచ్చే కళాఖండాలుగా తీయడంలో మణి సిద్దహస్తుడు. సో... ఈ చిత్రం కూడా చరణ్‌కు మరో విభిన్న చిత్రం అవుతుందనడంలో సందేహంలేదు. మొత్తానికి ఇప్పటికే ఒకసారి కొరటాల, మణిలకు హ్యాండిచ్చిన చరణ్‌ ఇప్పుడు మాత్రం వారికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి తన పంథా మారిందని నిరూపిస్తున్నాడు. దీనిలో చాలా రిస్క్‌ ఉన్నప్పటికీ దానిని ఎదుర్కోవడానికి చరణ్‌ సిద్దపడుతున్నాడు. మరి ఈ తెగింపు ఆయన భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తుందో వేచిచూడాల్సివుంది..! 

ram charan
dhruva movie director surender reddy
production company: geetha arts
heroine rakul preet singh
mani ratnam
koratala siva
oversiss