రాబోయే రెండు చిత్రాలపైనే సునీల్ ఆశ!

CineJosh news

కమెడియన్‌ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్‌ కొన్ని చిత్రాలతో ఓకే అనిపించాడు. అవి విజయం సాధించడంతో ఆయన తన ప్లస్‌ పాయింట్‌ అయిన కామెడీని వదిలి మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలపై దృష్టిపెట్టాడు. అలా సునీల్ చేసిన పలు చిత్రాలు వరుస పరాజయాల పాలయ్యాయి. 'తడాఖా'తో ఓకే అనిపించినా అందులో నాగచైతన్య కూడా నటించాడు. ఇక తాజాగా సునీల్ ఫ్యామిలీ సెంటిమెంట్‌ అండ్‌ ఎంటర్‌టైనర్స్‌పై మనసు పడ్డాడు. కానీ ఇవి కూడా చేదు అనుభవాలనే మిగిల్చాయి. తాజాగా వచ్చిన 'జక్కన్న' చిత్రం ఏ సినిమాలు పోటీలో లేకపోయే సరికి కలెక్షన్లపరంగా బి,సి సెంటర్లలో ఓకె అనిపించింది. ఇక తాజాగా ఆయన వీరుపోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ కూడా రిలీజయింది. ఇందులో సునీల్‌ మరలా కామెడీకి పెద్ద పీట వేశాడని అనిపిస్తోంది. కాగా వీరుపొట్ల కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన తీసిన 'బిందాస్‌, రగడ, దూసుకెళ్తా' చిత్రాలు కమర్షియల్‌గా వర్కౌట్‌ అయిన చిత్రాలే కావడంతో ఈ చిత్రంపై సునీల్‌ గంపెడాశలను పెట్టుకున్నాడు. సునీల్‌ త్వరలో 'ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' వంటి అభిరుచిగల చిత్రాలను తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ తో 'ఉంగరాల రాంబాబు' చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం కూడా సునీల్‌కు మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి సునీల్‌ను చూసి కాకపోయినా దర్శకులను చూసైనా సరే ఈ రెండు చిత్రాలు ఆయనకు మంచి హిట్‌ను ఇస్తాయనే ఆశ కనిపిస్తోంది. 

sunil
eedu gold ehe
veeru potla
kranthi madhav
sunil movies
jakkanna