దాసరి గారూ..ముందు మీరేం చేశారో చెప్పండి?

CineJosh news

వేదిక ఏదైనా సరే వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దాసరి నారాయణరావు ప్రత్యేకత. సీనియర్‌ ఆర్టిస్టులకు జరిగిన సన్మాన వేదికపై ఆయన పద్మ పురస్కార గ్రహితలగురించి విమర్శలు చేశారు. ప్రతిభ ఆధారంగా కాకుండా, కేవలం రికమండేషన్ల వల్లే పద్మ గౌరవం దక్కుతుందని ఆరోపించారు. 

టాలీవుడ్‌కు పద్మ పురస్కారాల విషయంలో సరైన న్యాయం జరగలేదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఈ విషయం దాసరికి తెలియంది కాదు. కేంద్ర మంత్రిగా నాలుగేళ్ళు పదవిలో ఉన్న ఆయనకు అప్పుడు వీటి విషయం గుర్తుకురాలేదు. న్యాయం చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్నేళ్ళ తర్వాత మాత్రం నోరు విప్పారు. జమున, అంజలీదేవి, సావిత్రి, కైకాల, గుమ్మడి లాంటి నట దిగ్గజాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. ఇది తెలుగువారందరూ ఆవేదన చెందే విషయమే. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ దాసరి ఉపయోగించుకోలేకపోయారు. పైకి జమున, కైకాల పేర్లు చెప్పినప్పటికీ, తనకు కూడా పద్మ గౌరవం దక్కలేదనే ఆవేదన దాసరిలో కనబడుతోంది. 

ఇక కేవలం రికమండేషన్ల వల్లే ఇస్తున్నారని అనడం వల్ల ఇప్పటి వరకు పద్మాలు అందుకున్నవారిని అవమానించినట్టే అవుతుంది. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వంటి ఆర్టిస్టులకు పద్మ గౌరవం దక్కింది. వీరందరికి కూడా రికమండేషన్‌ ద్వారానే ఇచ్చారా అనేది దాసరి స్పష్టం చేయాలి. మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే చేసే వ్యాఖ్యలు, పురస్కార గ్రహితలను బాధపెడతాయనే విషయాన్ని దాసరి గుర్తెరిగితే మంచిది.

dasari narayana rao
padma awards
jumuna
anjali
savitri
svr