పూరీ కి ఎందుకు ఇంత దయనీయ పరిస్థితి?

టాలీవుడ్‌లో ఎందరు టాప్‌ డైరెక్టర్స్‌ ఉన్నప్పటికీ వారిలో డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌ది సపరేట్‌ స్టైల్‌. ఇంతకాలం ఆయన ఓ హీరోకి కథ చెప్పాడంటే అది ఖచ్చితంగా పట్టాలెక్కేది. కానీ ఇటీవల వచ్చిన 'జ్యోతిలక్ష్మీ, లోఫర్‌' చిత్రాలు డిజాస్టర్స్‌గా మిగలడంతో ఇప్పుడు పూరీ ఎవ్వరికీ కథ చెప్పినా కూడా అవి పట్టాలెక్కలేకపోతున్నాయి. 'హార్ట్‌ఎటాక్‌' తర్వాత నితిన్‌కు ఓ కథ చెప్పాడు. కానీ అది ఫైనలైజ్‌ కాలేదు. ఇక చిరంజీవి కోసం 'ఆటోజానీ' కథను చెప్పాడు. అది కూడా వీలుకాలేదు. ఆ మధ్యన తాను మహేష్‌బాబుకు ఓ స్టోరీ చెప్పానని, త్వరలో అది పట్టాలెక్కనుందని ప్రకటించాడు.కానీ ఆ సినిమా జాడే కనిపించడం లేదు. కొత్త హీరో ఇషాన్‌ను పరిచయం చేస్తూ 'రోగ్‌' చిత్రాన్ని మొదలుపెట్టాడు. కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఒకప్పుడు కేవలం స్టోరీ లైన్‌ వినిపించి స్టార్‌హీరోలను సైతం మెప్పించిన పూరీ పరిస్థితి ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. కాగా ఆయన దర్శకత్వంలో నటించాలని నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఇంతకాలం ఆ అవకాశం రాలేదు. చివరికి పూరీకి కళ్యాణ్‌రామే దిక్కయ్యాడు. నిర్మాత దొరక్కపోయినా కళ్యాణ్‌రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం పూరీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. కాగా ఆయన తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌కి కూడా స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నానని చెబుతున్నాడు. 'టెంపర్‌'లో ఎన్టీఆర్‌ను అద్బుతంగా ఆవిష్కరించిన పూరీకి ఎన్టీఆర్‌ ఓకే చెప్పి సినిమాను పట్టాలెక్కిస్తాడా? లేక కళ్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేవరకు ఎదురుచూసి ఆ చిత్రం ఫలితం ఆధారంగా ఎన్టీఆర్‌ నిర్ణయం తీసుకుంటాడా? అనేది వేచిచూడాల్సివుంది...! 

puri jagannadh
kalyan ram
temper
jr ntr
puri jagan director
jyothi lakshmi