మహేష్‌కి ఆ టైటిల్‌నే ఫిక్స్‌ చేశారా..!

కొంతకాలం కిందట పూరీజగన్నాథ్‌-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందని, ఈ చిత్రానికి 'ఎనిమి' (శత్రువు) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ టైటిల్‌ను పూరీ సినిమాకు కాదని, మురుగదాస్‌-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో దాదాపు 110కోట్ల బడ్జెట్‌తో మూడు భాషల్లో తెరకెక్కించే చిత్రానికి 'ఎనిమి' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ప్రస్తుతం 'బ్రహ్మొత్సవం' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్‌ తన తదుపరి చిత్రంగా మురుగదాస్‌ సినిమానే ఓకే చేసిన సంగతి తెలిసిందే. 'బ్రహ్మొత్సవం' చిత్రం విడుదలైన కొద్దిరోజుల గ్యాప్‌లోనే మురుగదాస్‌ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీపొడక్షన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇదో మెసేజ్‌ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ అని, ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్‌ యాక్టర్‌ నటించబోతున్నాడు. హాలీవుడ్‌ నటుడు హారిసన్‌ ఫోర్డ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ నుండి వస్తున్నాడు కాబట్టి అతడికి రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే ముట్టచెబుతున్నారట. ఈ సినిమాను ఠాగూర్‌ మధు, ఎన్వీప్రసాద్‌లు నిర్మించనున్నారు. హీరోయిన్‌ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. శృతిహాసన్‌ పరిశీలనలో ఉన్నప్పటికీ బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. 

maheah babu
brahmothsawam
murugadoss
enemy movie
bombay backdrop