హిట్‌ కాంబినేషన్‌లో చీలికలు వచ్చాయట!

‘కిక్‌, రేసుగుర్రం’ లాంటి హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకొన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి, రచయిత వక్కంతం వంశీలది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వంశీ అందించిన కథలతోనే సురేందర్‌రెడ్డి ఎక్కువ శాతం విజయాలు సాధించాడు. అయితే తాజాగా వీరిమధ్య చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించాడు. ఆయనతో పాటు పనిచేసిన రచయితలు  దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ అయ్యారు. తాను అదే దారిలో దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న వంశీ త్వరలో ఓ స్టార్‌తో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. కాగా సురేందర్‌రెడ్డి త్వరలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కాకుండా కోనవెంకట్‌, గోపీమోహన్ లు సురేందర్‌రెడ్డితో కలిసి పనిచేస్తుండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. మరి ఈ హిట్‌ కాంబినేషన్‌లో వక్కంతం లేకుండా వేరుపడితే అది సురేందర్‌రెడ్డికి నష్టమా? లేక వక్కంతంకు నష్టమా? అనే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. తాత్కాలికంగా విడిపోయినా మరలా తమ పూర్వ అనుభవాల దృష్ట్యా శ్రీనువైట్ల, కోనవెంకట్‌, గోపీమోహన్‌ మధ్య ఏర్పడిన గ్యాప్‌లాగానే ఇది తాత్కాలికమే అని.. త్వరలో మరలా వీరిద్దరూ కలిసి పనిచేసే రోజు తప్పకుండా వస్తుందని విశ్లేషకలు భావిస్తున్నారు. 

vakkantham vamsi
surendar reddy
gopi mohan
kona venkat