మలయాళ ఇండస్ట్రీలో మహిళలను అగౌరవపరిచే సంస్కృతిపై హేమ కమిటీ కొన్ని పేజీల రిపోర్టును అందించింది. సెట్ల మహిళల సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నివేదిక బహిర్గతం చేసింది. కానీ ఇప్పటికి అయినా పరిస్థితులు మారాయా? అంటే చెప్పలేని పరిస్థితి.
ఇప్పుడు తనకు సెట్లో జరిగిన ఒక అవమానం గురించి సీనియర్ కథానాయిక శోభన గుర్తు చేసుకున్నారు. ఆరోజు తనను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఆ క్షణం కాపాడారని అన్నారు. అహ్మదాబాద్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్న సందర్భమది. ఆరోజు నేను చాలా దుస్తులు మార్చుకోవాల్సి ఉంది. కానీ కారవ్యాన్ లేదు. సౌకర్యాలు లేవు. ఎవరో ఆమె మలయాళ సినిమా నుండి వచ్చింది.. వారంతా చాలా అడ్జస్ట్ కాగలరు. ఆమె చెట్టు వెనుక దుస్తులు మార్చుకోగలదు! అని వ్యాఖ్యానించారు. బచ్చన్ సర్ వాకీ టాకీలో ఇది విన్న వెంటనే బయటకు వచ్చి.. ఎవరు చెప్పారు? అని అడిగారు. ఆ తర్వాత ఆయన నన్ను తన కారవాన్కి ఆహ్వానించి, దాన్ని ఉపయోగించుకోమని చెప్పి బయటకు వెళ్లారు అని శోభన నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
కల్కి 2898 AD షూటింగ్ సమయంలో కూడా, బచ్చన్ అదే వినయాన్ని ప్రదర్శించాడని కూడా శోభన గుర్తు చేసుకున్నారు. సెట్లో ప్రజలు తనను సందర్శించడానికి వచ్చినప్పుడు, భారీ ప్రోస్థటిక్స్ ధరించినప్పటికీ, వారిని పలకరించడానికి అమితాబ్ లేచి నిలబడేవారు. ఆయన ఒదిగి ఉండే స్వభావం ఎంతో గొప్పది అని కీర్తించారు. అమితాబ్ కల్కి చిత్రంలో అశ్వత్థామగా కీలక పాత్రను పోషించగా, ఇందులో మరియం అనే అతిథి పాత్రలో శోభన నటించారు.